యంగ్ హీరో నితిన్ భుజానికి కొన్ని నెలల క్రితం గాయమైన సంగతి తెలిసిందే. ఈ గాయం కారణంగానే ‘భీష్మ’ సినిమా ప్రారంభం ఆలస్యమైంది. మొత్తానికి గాయం నుంచి కోలుకుని ప్రస్తుతం ‘భీష్మ’ షూటింగ్‌లో నితిన్ బిజీగా ఉన్నారు. దీని తరవాత మరో రెండు సినిమాలను నితిన్ లైన్‌లో పెట్టారు. 


క్రియేటివ్ దర్శకుడు చంద్రశేఖర్ ఏలేటితో సినిమాను ప్రారంభించిన నితిన్.. వెంకీ అట్లూరి దర్శకత్వంతో ‘రంగ్ దే!’ అనే సినిమాను చేస్తున్నారు. ‘భీష్మ’లో నితిన్ సరసన రష్మిక మందన హీరోయిన్ కాగా.. చంద్రశేఖర్ ఏలేటి సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాశ్ వారియర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ‘రంగ్ దే!’లో కీర్తి సురేష్ హీరోయిన్. 


ఇదిలా ఉంటే, తాజాగా నితిన్ తన అభిమానులకు ఒక ఆసక్తికర విషయం చెప్పారు. రెండు నెలల్లో తాను 12 కిలోల బరువు తగ్గానని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఇంతకీ అంత బరువు తగ్గాల్సిన అవసరం నితిన్‌కు ఎందుకొచ్చింది? అనే ప్రశ్న తలెత్తుతోంది కదా! దాని గురించే నితిన్ వివరణ ఇచ్చారు. ఇప్పటి వరకు బయటికి తెలియని విషయాలను నితిన్ వెల్లడించారు. 


‘కొన్ని నెలల క్రితం నా భుజానికి బలమైన గాయమైంది. దాని నుంచి కోలుకోవడానికి ముందే అనుకోకుండా చేయి కాలింది! కాబట్టి, ఇంక చేసేది ఏముంది విశ్రాంతి తీసుకోవడం తప్ప. అలా విశ్రాంతి తీసుకొని తీసుకొని కొంచెం బరువు పెరిగా ఇలా. ఆ తరవాత ఎంతో కష్టపడి రెండు నెలల్లో 12 కిలోల బరువు తగ్గి మళ్లీ గతంలో మాదిరిగా మారిపోయాను. 


ఈ విషయంలో నా జిమ్ ట్రైనర్ వంశీకి తప్పకుండా కృతజ్ఞతలు తెలపాలి. నాలో స్ఫూర్తిని నింపి, నాపై ఎంతో శ్రద్ధ తీసుకుని, కచ్చితమైన డైట్, వర్కౌట్ ప్లాన్‌తో నా మనసు, శరీరం మెరుగుపడటానికి సాయపడటమే కాకుండా నాలోని గత సామర్థ్యాన్ని తీసుకురావడానికి దోహదపడ్డారు’ అని నితిన్ తన ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో పేర్కొన్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: