ఈ మద్య సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు ఏది నమ్మోలో ఏది నమ్మోద్దో తెలియకుండా పోతుంది. సెలబ్రెటీలకు సంబంధించిన ఏ చిన్న న్యూస్ అయినా సరే ఇట్టే వైరల్ కావడం..దానికి వెంటనే స్పందించి ఆ సెలబ్రెటీలు వివరణ ఇచ్చుకోవడం కామన్ అయ్యింది. కొన్ని సార్లు దారుణంగా సెలబ్రెటీలు చనిపోయారన్న న్యూస్ లు కూడా వైరల్ అవుతుండటం చూస్తూనే ఉన్నాం.
తాజాగా నటుడు, దర్శకులు పోసాని మురళీ పై వస్తున్న వార్తలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారాయి. ఇటీవల ఎన్నికల సమయంలో ఎంతో చురుకుగా కనిపించిన ఆయన హఠాత్తుగా హాస్పిటల్ లో చేరడం..ఆపరేషన్ వికటించడంతో మరో ఆసుపత్రిలో చేరి ప్రస్తుతం వైద్య చికిత్స పొందుతున్నారని రక రకాల వార్తలు వచ్చాయి. ఈ వార్తలతో పోసాని ఆరోగ్యంపై చిత్ర పరిశ్రమలో కూడా ఆందోళన నెలకొంది. తాజాగా తనపై వస్తున్న వార్తలపై పోసాని స్పందించారు.
చాలా రోజులుగా నా ఆరోగ్యం విషమంగా ఉందని మీడియాలో వార్తలు వస్తున్నట్లు నా స్నేహితులు తెలిపారు. నిజమే నాకు అనారోగ్యం వచ్చింది. కానీ చచ్చిపోయేంత కాదు అని పోసాని తెలిపారు. యశోద ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నా. వైద్యులు నన్ను బతికించారు. ఇప్పుడు ఇలా బాగానే ఉన్నానని పోసాని నవ్వుతూ మాట్లాడారు. నేను సంపూర్ణ ఆరోగ్యంత బయటకు వస్తానని..మళ్లీ సినిమాల్లో నటించి మిమ్మల్ని నవ్విస్తానని అన్నారు. తాను బావుండాలని కోరుకున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు పోసాని వీడియో ద్వారా అభిమానులకు తెలిపారు.