సాయి పల్లవి ఫిదా సినిమాతో ఒక చిన్న పాటి అలజడిని రేపింది. ఇండస్ట్రీలో ఉన్న టాప్ హీరోలందరినీ తన వైపుకు తిప్పుకుంది. అందం, అభినయంతో తక్కువ సినిమాలతో ఎంతో చక్కని గుర్తింపును తెచ్చుకుంది. పక్కింటి అమ్మాయిలా కనిపించే ఈ తమిళ కుట్టి ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుంది. అందుకే ఈ హీరోయిన్ డేట్స్ కోసం ఎంతో మంది ఫిల్మ్ మేకర్లు క్యూ కడుతున్నారు.


యంగ్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా నటించిన చిత్రం ‘డియర్ కామ్రేడ్'. భారీ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా ద్వారా భరత్ కమ్మ అనే కొత్త దర్శకుడు పరిచయం అవుతున్నాడు. ఇందులో హీరోయిన్‌గా నటించమని దర్శక, నిర్మాతలు ముందుగా సాయి పల్లవినే సంప్రదించారట. ఆమె ఒప్పుకోకపోవడంతో రష్మిక మందన్నాను తీసుకున్నారు. సాయి పల్లవికి చిత్ర దర్శకుడు భరత్ కమ్మ స్క్రిప్ట్ మొత్తం వినిపించారట.


ఈ కథ కూడా ఆమెకు బాగానే నచ్చిందని తెలిసింది. అయితే, ఇందులో కొన్ని సన్నివేశాల్లో దర్శకుడు లిప్ లాక్స్ పెట్టడం ఆమెకు నచ్చలేదని సమాచారం. ఈ సీన్స్ ఇప్పటి వరకు చేయని కారణంగా వాటిని తొలగించమని దర్శకుడిని సాయి పల్లవి కోరిందట. కథలో భాగంగా వచ్చే సన్నివేశాలను తీసివేయడానికి దర్శకుడు ఇష్టపడలేదని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఈ సినిమా చేయడానికి సాయి పల్లవికి నిర్మాతలు భారీ ఆఫర్ ఇచ్చారని ఫిలింనగర్‌లో ఓ వార్త హల్‌చల్ చేస్తోంది. అయినప్పటికీ లిప్‌లాక్ సన్నివేశాలు నచ్చక ఆమె సినిమా నుంచి తప్పుకుందని చిత్ర సీమలో టాక్ వినిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: