మన టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్స్ చాలామంది ఉన్నారు. కోటి, మణిశర్మ, కీరవాణి, దేవీ శ్రీ ప్రసాద్, థమన్...ఇలా చెప్పుకుంటూ పోతే చిట్టా పెద్దదే. అయినా కొరత అనే అంటుంటారు ఎందుకోమరి. ఈ నేపథ్యంలోనే పరభాషా సంగీత దర్శకులను మనవాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఎంకరేజ్ అని మనం అనుకుంటున్నాము కానీ వాళ్ళు మాత్రం మనవాళ్ళని ఎండగడుతున్నారని టాక్. ఎందుకంటే సినిమా రంగంలో కొందరి ఖర్చులు ఓ రేంజ్ లో వుంటాయి. డిమాండ్-సప్లయ్ ఆధారంగా వ్యవహారాలు నడుస్తాయి కనుక, భరించక తప్పదు. ఇలాంటి నేపథ్యంలో డిమాండ్ వున్న ఇద్దరు మ్యూజిక్ డైరక్టర్లలో ఒకరి వ్యవహారం నిర్మాతలకు కాస్త భారంగా వుంటోందని తెలుస్తోంది.

ఆ మ్యూజిక్ డైరక్టర్ రెగ్యులర్‌గా చెన్నయ్ నుంచి హైదరాబాద్ వస్తారట. ఆ ఖర్చు అప్పటికి చేస్తున్న ఎవరో ఒకరి సినిమా మీద పడుతుంది. చెన్నయ్ నుంచి హైదరాబాద్ కు తన కంప్యూటర్ సామగ్రి తీసుకురావడానికి, టికెట్లకు కొంత ఖర్చు. ఆ తరువాత ఆయన పార్క్ హయాత్ లోనే వుంటారట. వేరే హోటల్ అన్నా, గెస్ట్ హవుస్ అన్నా నో చెప్తారట. ఆవాసా లాంటి పదివేలతో పోయే హోటల్ లో వుండమన్నా నో-నెవర్ అనే అంటారట. పార్క్ హయాత్ లో కూడా ఖరీదైన సర్వీస్ అపార్ట్ మెంట్ లోనే. అక్కడేవుంటూ, హాయిగా సాయంత్రం వేళ తన వాళ్ళతో క్రికెట్ ఆడుకుంటూ, మధ్యలో సినిమా పని చూసుకుంటూ వుంటారని తెలుస్తోంది. పోనీ అలా అని ఒకటి రెండో రోజుల్లో పని అయిపోతుందా? అంటే చెప్పలేం. 

ఆయనకు ఎన్నాళ్లు హైదరాబాద్ లో వుండాలనిపిస్తే, అన్నాళ్లు పడుతుంది అని ఇండస్ట్రీ టాక్. ఇక్కడే ఓ ఆఫీసు, స్టూడియో, ఎక్విప్ మెంట్ పెట్టుకోవచ్చు కదా? దానికి కొంచెం చార్జ్ చేస్తే సరిపోతుంది కదా? నిర్మాతలకు చాలా మిగులుతుంది. పైగా ఆ సంగీత దర్శకుడు కోటి నుంచి కోటిన్నర తీసుకుంటారు. స్టూడియోకి ఎంతోకొంత చార్జ్ చేసినా నిర్మాతలు బాధపడరు. కానీ అలా చేయకుండా ఇలా పార్క్ హయాత్ బిల్లులు చెల్లించడం అంటే మామూలు విషయం కాదు? తెలీకుండానే బడ్జెట్ తడిసి మోపెడవుతుంది. మరి మనవాళ్ళైనా మన దగ్గర ఇంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉండగా వీళ్ళ వెంట ఎందుకు పడతారు..!



మరింత సమాచారం తెలుసుకోండి: