‘మజిలీ’ సినిమా హిట్టుతో అక్కినేని హీరో నాగచైతన్య మంచి జోష్ మీదున్నారు. ప్రస్తుతం ఆయన తన మేనమామ విక్టరీ వెంకటేష్‌తో కలిసి ‘వెంకీ మామ’ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తిచేసుకుంది. ప్రస్తుతం పోస్టు ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చైతూ సినిమా చేస్తున్నారు. సాయి పల్లవి ఈ సినిమాలో హీరోయిన్. ఇదిలా ఉంటే, ఇప్పుడు మరో సినిమాను నాగచైతన్య అంగీకరించారని అంటున్నారు. రెబల్ స్టార్ ప్రభాస్ భాగస్వామిగా ఉన్న యూవీ క్రియేషన్స్ సంస్థ నాగచైతన్యతో సినిమా చేస్తుందట. 


‘వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్’, ‘కృష్ణార్జున యుద్ధం’ సినిమాల దర్శకుడు మేర్లపాక గాంధీ ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారని తెలుస్తోంది. శేఖర్ కమ్ములతో సినిమా అనంతరం గాంధీ దర్శకత్వంలో నాగచైతన్య నటిస్తారని ఫిల్మ్ నగర్ టాక్. ప్రభాస్ భాగస్వామిగా ఉన్న ప్రొడక్షన్ హౌజ్‌లో నాగచైతన్య సినిమా చేస్తున్నారనే వార్త ఇప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. 


కాగా, ప్రస్తుతం ప్రభాస్ ‘సాహో’తో బిజీగా ఉన్నారు. ప్రస్తుతానికి షూటింగ్ అయితే పూర్తయింది. ఇక డబ్బింగ్, పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేయాల్సి ఉంది. ఆగస్టు 15న ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. అయితే, ఈ సినిమా వాయిదా పడిందనే వార్తలు వినిపిస్తున్నాయి. సుమారు రూ.300 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు సుజీత్ దర్శకత్వం వహించారు. శ్రద్ధా కపూర్ హీరోయిన్. జిబ్రాన్ నేపథ్య సంగీతం సమకూరుస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: