కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం 'సురరై పోట్రు' అనే చిత్రంలో నటిస్తున్నాడు. గురు ఫేమ్ సుధా కొంగర తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో సూర్య కు జోడిగా అపర్ణ బాలమురళి నటిస్తుంది. ఇక ఈ చిత్రంలో ప్రముఖ బాలీవుడ్ నటుడు పరేష్ రావెల్ ఓ ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నాడు. తమిళంలో ఇదే ఆయనకు మొదటి సినిమా. ఈ చిత్రం లో పరేష్ , ఎయిర్ లైన్స్ ఓనర్ గా నెగిటివ్ షేడ్స్ వున్న పాత్రలో కనిపించనున్నారని సమాచారం. సూర్య సొంత నిర్మాణ సంస్థ 2డి ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.
ఇక సూర్య ఈ సినిమా కన్నా ముందు 'కాప్పాన్' తో ప్రేక్షకులముందుకు రానున్నాడు. కెవి ఆనంద్ తెరకెక్కిస్తున్నఈ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ఆగస్టు 30న విడుదలకానుంది. తెలుగులో ఈ చిత్రం 'బందోబస్త్' పేరుతో విడుదలకానుంది. కాగా ఇటీవల 'యెన్ జి కె' తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూర్య కు ఆ సినిమా పెద్ద షాక్ ఇచ్చింది. మరి ఇప్పుడు ఈ రెండు సినిమాలతోనైనా హిట్లు కొట్టి సూర్య మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కుతాడో లేదో చూడాలి.