వాస్తవానికి ఒక్కోసందర్భంలో ఒకేరోజున రెండు లేక మూడు సినిమాలు విడుదలవడం అప్పుడప్పుడు మనం చూస్తుంటాం. అయితే అటువంటి సందర్భాలు కావాలని సృష్టించినవని కానప్పటికీ ఎక్కువగా యాదృచికంగానే జరుగుతుంటాయి. ఇక మరికొద్దిరోజుల్లో రాబోయే స్వతంత్ర దినోత్సవం రోజైన ఆగష్టు 15 నాడు రెండు సినిమాలు ఒకదానినొకటి ఢీ అంటే ఢీ అంటూ పోటీ పడబోతున్నాయ్. ఇక ఈ రెండు సినిమాలు ఢీకొట్టడానికి అసలు కారణం ప్రభాస్ హీరోగా రూపొందుతున్న సాహో సినిమానే. 

ఇటీవల సాహో టీజర్ రిలీజ్ సమయంలో తమ సినిమాను ఆగష్టు 15న విడుదల చేస్తున్నట్లు ప్రకటించిన యువి క్రియేషన్స్ సంస్థ, మూడు రోజుల కితం అర్ధాంతరంగా సినిమా క్వాలిటీ కారణంగా విడుదలను మరొక 15 రోజులు వాయిదా వేసి ఆగష్టు 30న సాహోను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఒక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే సాహో పోస్ట్ పోన్ అవుతుందన్న వార్త తెలియగానే అటు రణరంగం, ఇటు ఎవరు సినిమా నిర్మాతలు తమ సినిమాలను ఆగష్టు 15న విడుదల చేస్తున్నట్లు పోటాపోటీగా ప్రకటనలు విడుదల చేసారు. ఇప్పుడు ఇదే కొంత సమస్యగా పరిణమించింది. నిజానికి శర్వానంద్, అడివి శేష్ ఇద్దరూ కూడా మంచి అభిరుచి గల నటులు అనే చెప్పాలి. ఇక వారు నటించే సినిమాలు చాలావరకు ప్రేక్షకులను చేరువవుతూ ఉంటాయి. 

మరి అటువంటపుడు ఈ ఇద్దరు, ఇప్పుడు ఉన్నట్లుండి పోటీ పడి మరీ ఒకేరోజున రావడం వలన రెండు సినిమాలకు సరిగ్గా థియేటర్లు దొరక్కపోవడం, అదీకాక కలెక్షన్ల పరంగా కొంత సమస్యలు తలెత్తడం వంటివి జరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అంటున్నారు. అయితే తమ తమ సినిమాల మీద నమ్మకంతోనే ఆ రోజున విడుదల చేస్తున్నట్లు రెండు సినిమాల నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. మరి ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ రెండు సినిమాల ఆసక్తికర పోరులో ఎవరు విజేతగా నిలుస్తారో తెలియాలంటే మాత్రం మరికొద్దిరోజలు వేచి చూడాల్సిందే.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: