సందీప్ కిషన్ కథానాయకుడిగా నటించి, నిర్మిస్తున్న చిత్రం 'నిను వీడని నీడను నేనే'. అన్యా సింగ్ కథానాయిక. కార్తీక్ రాజు దర్శకుడు. వెంకటాద్రి టాకీస్ (ప్రొడక్షన్ నంబర్ 1), వి స్టూడియోస్, విస్తా డ్రీమ్ మర్చంట్స్ పతాకాలపై సినిమా తెరకెక్కింది. దయా పన్నెం, సందీప్ కిషన్, విజి సుబ్ర‌హ్మ‌ణ్య‌న్ నిర్మాతలు. ఎస్.ఎస్. తమన్ సంగీత దర్శకుడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ అనిల్ సుంకర సమర్పణలో రూపొందిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలై ప్రేక్షకుల నుండి మంచి హిట్ టాక్ సొంతం చేసుకుంది. అలాగే, స‌క్సెస్‌టూర్‌కు వెళిన సందీప్ కిష‌న్‌, హీరోయిన్ అన్యా సింగ్‌, ఇత‌ర టీమ్ స‌భ్యుల‌కు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. శనివారం సాయంత్రం ఈ సినిమా థాంక్యూ మీట్ నిర్వహించారు.  


సందీప్ కిషన్ మాట్లాడుతూ "వెంకటాద్రి టాకీస్‌లో ఈ విజ‌యానికి నేను ముఖ్యంగా వేంకటేశ్వర స్వామికి థాంక్స్ చెప్పుకోవాలి. విడుదలకు ముందు రోజు గురువారం రాత్రి తిరుమల వెళ్లాను. శుక్రవారం ఉదయం నా దర్శనం. ఫోన్ స్విచ్ఛాఫ్ చేశా. ఒంటిగంటన్నరకు ఫోన్ ఆన్ చేస్తే రిజల్ట్ తెలుస్తుందని అనుకున్నాను. సాధారణంగా మూడు, నాలుగు గంటలకు నా సినిమా రిజల్ట్ నాకు తెలుస్తుంది. అంటే... ఆడుతుందా? లేదా? అని. ఇప్పటివరకూ చూస్తే... నిజాయతీగా నేను ఫలితం గురించి చెప్పేశా. ఆడకపోతే ఆడలేదని, ఆడితే ఆడిందని. 'నిను వీడని నీడను నేనే' విషయానికి వస్తే... మూడు గంటలకు నాకు అర్థం కాలేదు. పరిస్థితి ఏంటని. అందరూ బావుందంటున్నారు. రివ్యూలు బావున్నాయి. కానీ, నేను కన్వీన్స్ కాలేదు. ఊరికే నెత్తికి ఎక్కించుకోకూడదు. హిట్టా? కాదా? అని కరెక్టుగా అర్థం చేసుకోవాలని అనుకున్నా. ఆరు గంటలకు ఫోనులు రావడం స్టార్ట్ అయింది. నిజంగానే సందీప్‌కి హిట్ ప‌డిందా? అని ఆలోచించి, టైమ్ తీసుకుని, అర్థం చేసుకుని  అందరూ ఫోనులు చేశారు. సోమవారం నుంచి ఇండస్ట్రీలో అందరూ ఫోనులు చేయడం స్టార్ట్ చేశారు. పెద్ద పెద్ద వాళ్లు క్యూబ్‌లో షో వేయించుకోవాలని ఫోన్లు చేయడం, చూశాక చాలా బావుందని ఫోనులు చేయడం మొదలయ్యాయి. ఈ సినిమాకు జరిగిన ఒక అద్భుతం ఏంటంటే... చాలా రోజుల తరవాత రోడ్డు మీద నిలబడితే జనాలు పరిగెడుతూ వచ్చి 'సినిమా చూశాం. చాలా చాలా బావుంది. ఫలానా సీన్ బావుంది. లాస్ట్ లో మదర్ సెంటిమెంట్ బావుంది' అని చెప్పారు. అది నిజమైన విజయమని నేను భావిస్తా. ఇంచుమించు రెండేళ్ల తరవాత విజయం వచ్చింది. హిట్, మంచి హిట్ వచ్చింది. బ్లాక్‌బ‌స్ట‌ర్‌, సూప‌ర్ హిట్ అన‌ను. ఆ విష‌యంలో నేను నిజాయ‌తీగా ఉంటాను. ఈ సినిమా విడుదలకు ముందు కథ తెలిసిన వాళ్లు, సినిమా చూసినవాళ్లు... 'సెకండాఫ్‌లో ఎందుకు ఎమోష‌న్‌ మీద వెళుతున్నారు. తనను ఎవరో చంపేసి ఉండొచ్చు కదా. సక్సెస్ ఫార్ములా. కమర్షియల్ ఫార్ములా. గతంలో సక్సెస్ అయిన సినిమాల్లా ఇదీ సక్సెస్ అవుతుంది' అన్నారు. అలా చేస్తే ఆ సినిమాలకు ఈ సినిమాకు తేడా ఉండదు. ఇది అటువంటి సినిమా ఇంకొకటి అవుతుంది. నేను వాళ్లకు అదే చెప్పాను. అమ్మానాన్న ప్రేమను, ఎమోషన్ ను మేం బలంగా విశ్వసించాము. ఆ నమ్మకంతో ముందుకు వెళ్లాం. మా నమ్మకం ఈ విజయాన్ని ఇచ్చిందని నమ్ముతున్నా. విశాఖ నుంచి ఒక పెద్దావిడ ఫోన్ చేశారు. సినిమా చూశాక కళ్లవెంట నీళ్లు వచ్చాయని చెప్పారు. 'మా అబ్బాయి మూడు నెలల కిందట లవ్ ఫెయిల్యూర్ అని సూసైడ్ చేసుకున్నాడు. ఒకవేళ ఈ సినిమా మూడు నెలల కిందట వచ్చి ఉంటే, మా అబ్బాయి సినిమా చూసి ఉంటే.. ప్రాణాలు తీసుకునే ముందు మా గురించి ఆలోచించే ఉండేవాడేమో' అన్నారు. నా కళ్ల వెంట నీళ్లు తిరిగాయి. అదే 'నిను వీడని నీడను నేనే' సినిమా విజయం. ఈ సినిమాకు భారీ లాభాలు రావాలని మేం పని చేయలేదు. మంచి సినిమా, నిజాయతీతో కూడిన సినిమా తీయాలనుకున్నాం. ఎవరికీ నష్టం రాకూడదని తీశాం. ఈ రోజు నేను గర్వంగా చెబుతున్నా...  మమ్మల్ని నమ్మి సినిమా కొన్న ప్రతి డిస్ట్రిబ్యూట‌ర్ సేఫ్ అయ్యాడు. నన్ను నమ్మి డబ్బులు పెట్టిన దయా, అనిల్ సుంకర గారు ఇవాళ సంతోషంగా. హ్యాపీగా ఉన్నారు. థియేటర్లలో చూడని వాళ్లు త్వరగా థియేటర్లకు వెళ్లండి. నెక్స్ట్ సినిమాను త్వరలో అనౌన్స్ చేస్తాం. చాలా గర్వంగా చూపించుకోదగ్గ మంచి ప్రాజెక్ట్ అది. సోమవారం నుండి నెల రోజుల పాటు వివాహ భోజ‌నంబు నుండి వంద‌మందికి ఫ్రీ ఫుడ్ ప్యాకెట్లు ఇస్తున్నాం. ఈ సినిమాకు ద‌యా, అనిల్‌గారితో పాటు నెల్లూరు డాక్ట‌ర్‌గారు, మా డిస్ట్రిబ్యూట‌ర్‌ ఎంతో హెల్ప్ చేశారు. నాలుగు ఏరియాలు ఆయనే కొన్నారు" అని అన్నారు.  


ఎస్.ఎస్. తమన్ మాట్లాడుతూ "దేవుడు సందీప్ కిషన్ కష్టాన్ని గురించాడు. కొన్ని సినిమాలు చేసేటప్పుడు క‌మ‌ర్షియ‌ల్‌గా ఏం ఆలోచించం. మ‌న‌కు మ‌నుషులు ముఖ్య‌మ‌ని అనుకుంటాం. వాళ్లు మనకు చాలా అవసరమని భావిస్తాం. సందీప్ నాకు మంచి ఫ్రెండ్. తన కోసం నేను ఈ సినిమా చేశాను. ఎగ్జిక్యూటివ్ నిర్మాత శివ చెర్రి, ఈ టీమ్ అంతా చాలా కసిగా సినిమా చేశారు. దర్శకుడు కార్తీక్ రాజు విఎఫ్ఎక్స్‌లో మంచి క‌మాండ్ ఉన్న వ్య‌క్తి. ఆయన కథ చెప్పినప్పుడు చాలా బావుందని సందీప్ కి చెప్పాను. సందీప్ గెలవాలని, అతణ్ణి ఎలాగైనా గెలిపించాలని ఒకే ఉద్దేశ్యంతో ఈ సినిమా చేశాం. ఈ రోజు సినిమా ఇంత మంచి విజ‌యం సాధించ‌డం చాలా చాలా సంతోషంగా ఉంది. నేను స‌క్సెస్‌టూర్‌కి వెళ్లాల్సింది. కానీ, కుద‌ర‌లేదు. నేనింకా షాక్‌లోంచి బ‌య‌ట‌కు రాలేదు. సందీప్‌కి స‌క్సెస్ వ‌చ్చేసిందా? మ‌నోడికి స‌క్సెస్ వ‌చ్చేసిందా? అనుకుంటున్నా. నాకు తెలిసిన వ్య‌క్తుల‌ను, ట్రేడ్ వ‌ర్గాల‌ను క‌నుక్కున్నా. ఇన్వెస్ట్ చేసిన డ‌బ్బు కంటే ఎక్కువ వ‌చ్చింది. మేం హ్యాపీ.  సందీప్ గెలిచాడని సంతోషంగా ఉంది. తన లాంటి హార్డ్ వర్కర్స్ గెలవాలి. ఇటువంటి కొత్త సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి అయినా గెలవాలి. చాలామందికి ఇటువంటి కథతో సినిమా చేయడానికి ధైర్యం చాలదు. ఆ ధైర్యానికి సందీప్ ని మనం మెచ్చుకోవాలి. భవిష్యత్తులోనూ అతడికి మంచి విజయాలు రావాలి. నిర్మాతలు, ఇతర టీమ్ సభ్యులకు కంగ్రాట్స్. రాత్రీపగలూ కష్టపడి చేశారు. వాళ్లు విడుదల తరవాత కూడా బాగా ప్రమోట్ చేశారు. ఎన్నో పెద్ద సినిమాల మధ్య ఈ సినిమాను గెలిపించారు. మంచి సినిమాను ప్రేక్షకుల మధ్యకు తీసుకువెళ్లారు" అని అన్నారు.

నిర్మాత సుప్రియ మాట్లాడుతూ "తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులకు థాంక్స్. ఈ సినిమాలో మమ్మల్ని ఓ భాగం చేసిన సందీప్ కిషన్ కి థాంక్స్. ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా థాంక్స్" అని అన్నారు.


హీరోయిన్ అన్యా సింగ్ మాట్లాడుతూ "మా చిత్రాన్ని, నన్ను ఆదరించిన ప్రేక్షకులకు థాంక్స్. తెలుగు సినిమా పరిశ్రమలోకి నాకు మంచి స్వాగతం లభించింది. సినిమా విడుదలైన తరవాత చాలా థియేటర్లకు వెళ్లాం. ప్రతిచోట స్పందన అద్భుతంగా ఉంది. ప్రేక్షకులు ఎంతో ప్రేమను చూపించారు. సందీప్ కిషన్, ప్రమోద్, దయా, సుప్రియ, సీతారామ్, శివ చెర్రి ఎంతో కష్టపడ్డారు " అని అన్నారు.


ఈ కార్యక్రమంలో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు శివ చెర్రి, సీతారామ్ తదితరులతో పాటు యూనిట్ సభ్యులు పాల్గొన్నారు


మరింత సమాచారం తెలుసుకోండి: