16ఏళ్ల కిందట బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసిన ‘మన్మథుడు’ చిత్రానికి సీక్వెల్‌గా ‘మన్మథుడు 2’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం అందరికి తెలిసిందే. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఆగస్టు 9న ప్రేక్షకుల ముందుకు రానుంది. నాగార్జున కథానాయకుడిగా రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మన్మథుడు2’. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కథానాయిక. సమంత, కీర్తిసురేశ్‌ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

ఈ సందర్భంగా నాగార్జున వినూత్న ప్రచారానికి తెర తీశారు. దర్శకుడు రాహుల్‌తో కలిసి ఓ ప్రాంక్ వీడియో చేసిన నాగ్‌ అతన్ని తనదైన శైలిలో కొద్దిసేపు ఆటపట్టించారు. రాహుల్‌కు ఫోన్‌ చేసి ఏం చేస్తున్నావంటూ నాగ్‌ ప్రశ్నించగా, ‘వెన్నెల కిషోర్‌ డబ్బింగ్‌లో ఉన్నా’ సర్‌ అని రాహుల్‌ సమాధానం ఇవ్వగా, ‘మీరిద్దరూ జోకులు వేసుకుంటూ కూర్చొన్నారా? లేక డబ్బింగ్‌ చెబుతున్నారా’ అంటూ వ్యంగ్యంగా చురకలు అంటించారు.

ఆ తర్వాత తనకిష్టమైన ఫుడ్‌ కోసం రాహుల్‌ను రెస్టారెంట్‌కు పంపారు. అక్కడకు వెళ్లిన తర్వాత వేరే కస్టమర్ ఆర్డర్ చేసిన జ్యూస్ తాగమని, వెయిటర్‌తో దురుసుగా ప్రవర్తించమని అన్నారు. బయటకు వచ్చిన తర్వాత పరిచయం లేని అమ్మాయితో మాట్లాడమని, ఆమెను పొగడాలని వింత వింత పనులు చేయించారు. కాస్త ఇబ్బంది పడుతూనే ఆ పనులన్నీ రాహుల్‌ పూర్తి చేశాడు. ఇలా కాస్త విభిన్నంగా ‘మన్మథుడు2’ ప్రచారానికి తెరతీశారు నాగార్జున. కావాలంటే మీరూ ఆ వీడియోను చూసేయండి!

https://www.videogram.com/comic/c17edc2a-476f-4eff-b86e-c7f256409382/


మరింత సమాచారం తెలుసుకోండి: