ఆర్ఎక్స్ 100 హీరో కార్తికేయ తాజాగా ఓ వివాదంలో ఇరుక్కున్నారు. కమెడియన్ హీరో సంపూర్ణేశ్ బాబుతో పాటు అతని నిర్మాతతోనూ అక్షింతలు వేయించుకున్నారు. సినీ ఇండస్ట్రీలో తోటి కళాకారులను గౌరవించడం తెలియదా అంటూ తిట్లు తినే పరస్థితి తెచ్చుకున్నారు.


అసలు ఇంతకీ ఏమైందంటే.. కొబ్బరిమట్ట చిత్రంలోని ఓ సన్నివేశాన్ని కార్తికేయ హీరోగా నటించిన ‘హిప్పీ’ సినిమాలో వాడుకున్నారట. ఈ విషయంపై కొబ్బరి మట్ట నిర్మాత సాయి రాజేశ్ ట్విట్టర్‌లో పైర్ అయ్యారు.


‘హాయ్‌ కార్తికేయ.. మీరు నటించిన ‘హిప్పీ’ సినిమాలో ‘కొబ్బరిమట్ట’ చిత్రాన్ని, సంపూర్ణేశ్‌బాబుని, నన్ను టార్గెట్‌ చేసిన సన్నివేశాన్ని చూశాను. దీనికి నేను ‘హిప్పీ’ సినిమా దర్శకుడిని తప్పుబట్టను. కానీ, ఈ సన్నివేశాన్ని రాసిన రచయితకు, నటించిన మీకు తెలియాల్సింది ఏంటంటే.. ఇండస్ట్రీలో ఉన్నారు కాబట్టి సినిమాను, సహ నటులకు గౌరవం ఇవ్వండి’ అని పోస్ట్ చేశారు.


తన నిర్మాత పెట్టిన పోస్టుపై హీరో సంపూ కూడా రియాక్టయ్యాడు. ‘కార్తికేయ.. నా మీద వేసిన జోక్‌కి ఫర్వాలేదు. తిట్లు నాకు ఇవాళ కొత్త కాదు. కానీ విడుదల అవ్వని సినిమా గురించి తప్పుగా మాట్లాడటం కరెక్ట్ కాదు. మేము ఎంతో ప్రేమించి, మరెన్నో కష్టాలు పడి తీసిన సినిమా ‘కొబ్బరిమట్ట’. ఇలా కామెడీ చేయడం చాలా బాధాకరం’ అని సంపూ పోస్టు చేశాడు.


వీరి స్పందన చూసిన తర్వాత హీరో కార్తికేయ కూడా స్పందించాడు.. తాను ఎవరినైనా బాధపెట్టి ఉంటే సారీ అంటూ వివాదానికి ముగింపు పలికాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: