తెలుగు బుల్లితెరపై ‘బిగ్ బాస్’ రియాలిటీ షో ఇప్పటి వరకు రెండు సీజన్లలో వినోదాన్ని పంచింది. తొలి సీజన్కు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్గా వ్యవహరించడంతో విపరీతంగా పాపులర్ అయ్యింది. తెలుగు టెలివిజన్ చరిత్రలో కనీవినీ ఎరుగని టీఆర్పీ రేటింగ్ వచ్చింది. ఆ తరవాత నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించిన సీజన్ 2 కూడా అదే స్థాయిలో ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు కింగ్ నాగార్జున హోస్ట్గా మూడో సీజన్ మొదలైంది. ఈ సీజన్లో 15 మంది సెలబ్రిటీలు కంటెస్టెంట్లుగా హౌజ్లోకి అడుగుపెట్టారు. వీరిలో ఇద్దరు కంటెస్టెంట్లు ప్రత్యేకంగా నిలిచారు. ఎందుకంటే వారిద్దరూ నిజజీవితంలో భార్యభర్తలు.
సినీ హీరో వరుణ్ తేజ్, ఆయన సతీమణి, నటి వితికా షెరు 14, 15వ కంటెస్టెంట్లుగా బిగ్ హౌజ్లోకి అడుగుపెట్టారు. మిగిలిన కంటెస్టెంట్లంతా ఒక్కరొక్కరిగా వేదికపైకి ఎంట్రీ ఇస్తే.. ఈ జంట కలిసే వచ్చారు. తన సూపర్ హిట్ సినిమా ‘కొత్తబంగారులోకం’లో ‘నిజంగా నేనేనా’ అనే పాటతో క్లాస్ లుక్లో మొదట వరుణ్ సందేశ్ వచ్చారు. అదే సినిమాలోని ‘నేనని నీవని’ పాటతో వరుణ్ సందేశ్ భార్య వితికా షెరు పైనుంచి దేవతలా దిగివచ్చారు. మొత్తంగా ఈ జంట తమ పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను కట్టిపడేసింది. అంతేకాదు, నాగార్జునను కూడా విపరీతంగా ఆకట్టుకుంది.
అయితే, వరుణ్ సందేశ్ జంటకు నాగార్జున ఒక క్లిష్టమైన ప్రశ్నను సంధించారు. ‘13 మంది ఎలిమినేట్ అయిపోయారు. మీరిద్దరే ఉన్నారు. అలాంటి క్లిష్టపరిస్థితిలో ఎవరు ఎలా డిసైడ్ అవుతారు నాకు చెప్పండి’ అని నాగార్జున అడిగారు. దీనికి వితికా స్పందిస్తూ.. ‘మేమిద్దం ఒకవేళ అలాంటి పరిస్థితిలో ఉంటే, నేను ఇన్ని రోజులూ కష్టపడి ఇంత శ్రమపడ్డాను కాబట్టి నేనే గెలవాలని అనుకుంటాను. వరుణ్ను పక్కన పెట్టేస్తాను’ అని బదులిచ్చారు.
ఇక వరుణ్ మాట్లాడుతూ.. ‘నేను కూడా గెలుద్దామనే అనుకుంటాను. తను గెలిచినా కూడా హ్యాపీనే. ఎందుకంటే ఆమె నా భార్య, ఆమె గెలిస్తే నేను గెలిచినట్టే’ అని సమాధానం ఇచ్చి నాగార్జునను ఇంప్రస్ చేశారు. ఆ తరవాత ‘జంటగా వెళ్తున్నారు.. ఒంటరిగా ఆడాలి’ అని వాళ్లిద్దరినీ నాగార్జున హౌజ్లోకి పంపించారు.