సింగర్ స్మిత గురించి తెలియని తెలుగువారుండరు. పాప్ సింగర్‌గా, నేపథ్య గాయనిగా, నటిగా ఆమె తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. విజయవాడకు చెందిన స్మిత తన మ్యూజికల్ జర్నీలో 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. 1997లో ఈటీవీలో ప్రసారమైన ‘పాడుతా తీయగా’ కార్యక్రమంలో పాల్గొన్న స్మిత.. గానగాంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆశీస్సులు పొందారు. 


ఆ తర్వాత స్వయంగా ‘హాయ్ రబ్బా’ అనే పాటను రూపొందించారు. తెలుగులో వచ్చిన తొలి పాప్ సాంగ్ ఇదే. ఈ పాటతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ తరవాత పాత పాటలను రీమేక్ చేశారు. పలు సినిమాల్లో పాటలు పాడారు. 


సింగర్‌గా స్మిత 20 ఏళ్లు పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా ‘ఎ జ‌ర్నీ 1999-2019’ అనే పేరుతో హైదరాబాద్‌లో సోమవారం రాత్రి వేడుక‌ను నిర్వహించారు. ఈ వేడుక‌కు కింగ్ నాగార్జున‌, జ‌గ‌ప‌తిబాబు, నేచుర‌ల్ స్టార్ నాని, అల్లరి నరేష్, న‌వ‌దీప్‌, ఎం.ఎం.కీర‌వాణి, క‌ల్యాణి మాలిక్‌, వై.వి.ఎస్‌.చౌద‌రి, దేవాక‌ట్టా, విష్ణు ఇందూరి ముఖ్య అతిథులుగా హాజ‌రయ్యారు. స్మిత్ లైవ్‌లో పాటలు పాడి శ్రోతలను అలరించారు. 


1999లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన స్మిత.. ఇప్పుడు కొత్త ప్రయాణాన్ని మొద‌లుపెడుతున్నారు. ఇప్పటి వరకు గాయనిగా మెప్పించిన స్మిత ఇప్పుడు సమాజంలోని సమస్యలను ఒక వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీని కోసం ‘యువరానర్’ అనే షోకు రూపకల్పన చేశారు. ఈ షో ప్రోమోను నాగార్జున ఆవిష్కరించారు. ఈ షోకు స్మిత హోస్ట్‌గా వ్యవహరిస్తారు. ఈ షో ద్వారా సమాజంలోని సమస్యలపై ప్రశ్నించే ప్రయత్నం చేయబోతున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: