నారా రోహిత్ హీరోగా నటించిన "సోలో" సినిమాలో చిన్న పాత్రతో ఇండస్ట్రీకి పరిచయమైన నటుడు శ్రీ విష్ణు. ఆ తర్వాత చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు చేసాడు. సన్నాఫ్ సత్యమూర్తి , జయమ్ము నిశ్చయమ్మురా మొదలగు సినిమాల్లో కనిపించాడు. అయితే రెగ్యులర్ హీరోగా అతడు నటించిన "అప్పట్లో ఒకడుండేవాడు" సినిమా విజయంతో పాటు అతనికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది.
ఆ సినిమాతో అతడు వరుసగా హీరోగా సినిమాలు చేస్తున్నాడు. పూర్తి విభిన్న కథలని ఎంచుకునే శ్రీ విష్ణు నుండి మెంటల్ మదిలో, నీది నాది ఒకే కథ లాంటి మంచి సినిమాలు వచ్చాయి. ఈ సినిమాల వల్ల శ్రీ విష్ణు కి కథల పట్ల మంచి జడ్జిమెంట్ ఉందని అర్థమవుతుంది. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో మొన్న వచ్చిన "బ్రోచేవారెవరురా" సినిమా మంచి విజయం సాధించింది.
ఇందులో శ్రీ విష్ణు నటనకి మంచి మార్కులే పడ్డాయి. శ్రీ విష్ణు ప్రస్తుతం `తిప్పరా మీసం` సినిమాను చేస్తున్నాడనే సంగతి తెలిసిందే. కాగా.. దీని తర్వాత ఈ హీరో గీతాఆర్ట్స్లో మినిమం బడ్జెట్ చిత్రాలను నిర్మించే జి.ఎ 2 పిక్చర్స్ బ్యానర్పై సినిమా చేయబోతున్నాడని గుసగుసలు వినపడుతున్నాయి.బన్నీ వాసు నిర్మాతగా శ్రీవిష్ణు ఓ సినిమాలో నటించబోతున్నాడట.
ఈ సినిమాను `పేపర్బోయ్` దర్శకుడు జయశంకర్ తెరకెక్కిస్తాడని టాక్. స్క్రిప్ట్ వర్క్ తుది దశకు చేరుకుందని, అంతా ఓకే అయితే సినిమాను అనౌన్స్ చేస్తారని టాక్. నారా రోహిత్కు క్లోజ్ ఫ్రెండ్ అయిన శ్రీవిష్ణు, మెగా కాంపౌండ్కు సంబంధించిన గీతాఆర్ట్స్లో సినిమా చేయడం విశేషమే మరి.వైవిధ్యమైన కథలని ఎంచుకునే శ్రీ విష్ణు ఇప్పుడు ఎలాంటి కథతో వస్తాడో చూడాలి.