విజయ దేవరకొండ, రష్మిక మందన జంటగా నటించిన ‘డియర్ కామ్రేడ్’ సినిమా ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. విడుదలకు మూడు రోజుల ముందే బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ఈ చిత్రాన్ని చూసేశారు. అంతేకాదు, సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సినిమా అద్భుతంగా ఉందని, దీన్ని హిందీలో తానే స్వయంగా రీమేక్ చేస్తున్నానని కూడా ప్రకటించారు. ఇప్పటికే ‘డియర్ కామ్రేడ్’పై భారీ అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో కరణ్ జోహార్ ఫస్ట్ రివ్యూ ఈ సినిమాకు బలం చేకూర్చింది. 


‘డియర్ కామ్రేడ్‌ను చూసిన మొదటి ప్రేక్షకుడిని నేను కావడం సంతోషంగా ఉంది! సినిమా చాలా పవర్‌ఫుల్‌గా ఉంది. ఉద్వేగంతో కూడిన ప్రేమకథ!!! విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటన మరో స్థాయిలో ఉంది!! సినిమా అద్భుతంగా సాగుతుంది. ప్రేక్షకులకు ముఖ్యమైన, సంబద్ధమైన సందేశాన్ని ఇస్తుంది! దర్శకుడు భరత్ కమ్మ శక్తివంతంగా డైరెక్ట్ చేశారు. మైత్రీ మూవీస్ అద్భుతంగా నిర్మించింది. 


జస్టిన్ ప్రభాకరన్ చాలా మంచి సంగీతం అందించారు. డియర్ కామ్రేడ్‌ను ధర్మ మూవీస్ హిందీలో రీమేక్ చేస్తుందని ప్రకటించడం పట్ల ఎంతో సంతోషిస్తున్నాను!! చాలా చాలా ఆనందంగా ఉంది!!!’ అని కరణ్ జోహార్ ఇన్‌స్టాగ్రామ్‌లో పేర్కొన్నారు. విజయ్ దేవరకొండ, నిర్మాత నవీన్ ఎర్నేని, డైరెక్టర్ భరత్ కమ్మలతో తీసుకున్న ఫొటోలను పోస్ట్ చేశారు. 


ఇప్పటికే ‘డియర్ కామ్రేడ్’ను తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళంలో నిర్మించి విడుదల చేస్తున్నారు. ఇప్పుడు ఈ చిత్రం బాలీవుడ్‌కు కూడా వెళ్తోంది. అయితే, అక్కడ ఈ చిత్రంలో ఎవరు నటిస్తారు, ఎవరు దర్శకత్వం వహిస్తారు అనే విషయాలు ఇంకా ఖరారు కాలేదు. విజయ్ దేవరకొండ బ్లాక్ బస్టర్ మూవీ ‘అర్జున్ రెడ్డి’ హిందీలో ‘కబీర్ సింగ్’గా రీమేక్ అయ్యి అక్కడా సూపర్ డూపర్ హిట్ అయ్యింది. మరి ఈ ‘డియర్ కామ్రేడ్’ ఏం చేస్తాడో చూడాలి. కాగా, ‘డియర్ కామ్రేడ్’ నాలుగు భాషల్లో ఒకేసారి ఈనెల 26న విడుదలవుతోంది. 



మరింత సమాచారం తెలుసుకోండి: