యంగ్ హీరో నిఖిల్ కి బాగానే హిట్లు వచ్చాయి. నిజానికి నిఖిల్ కి వచ్చిన సక్సెస్ స్థాయికి.. నిఖిల్ వరుస సినిమాల రిలీజ్ లతో బిజీ బిజీగా ఉండాలి. కానీ ఒక్క హిట్ కూడా లేని హీరో సినిమాల లాగా నిఖిల్ సినిమాలు తయారవుతున్నాయి. టాలీవుడ్ లో ఇప్పుడంతా యంగ్ హీరోలదే హవా. కానీ ఆ హవాలో హడావుడి చెయ్యాల్సిన నిఖిల్.. అసలు ఏ మాత్రం తన ఉనికిని చాటుకోలేకపోతున్నాడు. ప్రస్తుత విషయంలోకి వెళ్తే.. నిఖిల్ నటించిన కొత్త చిత్రం 'అర్జున్ సురవరం'.
ఈ సినిమాకు ఇంకా కష్టాలు తొలగలేదు. మొదట్లో 'ముద్ర' అనే టైటిల్ పెట్టగా వేరే సినిమాతో వివాదమై దాన్ని 'అర్జున్ సురవరం'గా మార్చారు. ఆ తర్వాత మే 1న సినిమా వస్తుందనుకుంటే అది వాయిదాపడింది. ఆ తరవాత కూడా పలుసార్లు తేదీని మార్చారు. ట్రైలర్ బాగుండటంతో సినిమా త్వరగా రిలీజైతే చూడాలని ప్రేక్షకులు అనుకుంటున్నారు. కానీ ఇప్పటికీ ఆ సినిమా కష్టాలు తొలగినట్టు కనిపించట్లేదు.
కొన్ని రోజుల క్రితం ఈ సినిమా బయటకు రావాలంటే ఇంకా సమయం పడుతుంది అన్నారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా ఇంకా సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నట్లు ఉంది. టి.సంతోష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని బి.మధు సమర్పణలో మూవీ డైనమిక్స్ ఎల్ఎల్పీ, ఔరా సినిమాస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్లపై రాజ్ కుమార్ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్ నిర్మించారు.