శుక్రవారం బాక్సీఫీస్ వద్ద విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ చిత్రం రిలీజైంది. పెళ్లి చూపులు, గీతాగోవిందం, అర్జన్ రెడ్డి సినిమాలతో మెప్పించినా ఇప్పుడు చేతిలో ఇంకా చాలా సినిమాలున్నాయి. తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామళైతో హీరో అనే సినిమా చేస్తున్నాడు ఈ హీరో. మరోవైపు క్రాంతిమాధవ్ దర్శకత్వంలో సినిమా కూడా సెట్స్ పై ఉంది. వీటితో పాటు లిస్ట్ లో పూరి జగన్నాధ్, పరశురాం, శివ నిర్వాణ లాంటి దర్శకుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అంతా బాగానే ఉంది హీరో సినిమా పరిస్థితేంటి? ప్రస్తుతం ఈ సినిమా ఆగిపోయినట్టు తెలుస్తోంది.
ఆగిపోవడం అంటే డియర్ కామ్రేడ్ రిలీజ్ వల్ల షూటింగ్ ఆగిపోవడం కాదు. మొత్తంగా సినిమానే పక్కనపెట్టినట్టు టాక్. అవును.. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై వస్తున్న ఈ సినిమా కోసం ఇప్పటికే 5 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. ఢిల్లీలో భారీఎత్తున రేసింగ్ సన్నివేశాలు తీశారు. కానీ కోట్లు ఖర్చుపెట్టి తీసిన ఆ సన్నివేశాలు ఆశించిన స్థాయిలో రాలేదట. దీంతో ఆనంద్ అన్నామళై దర్శకత్వంపై అందరికీ అనుమానాలు పెరిగిపోయాయి. ఇప్పటికే 5 కోట్లు ఆవిరి అయిపోయాయి. ఇంకా ఈ దర్శకుడ్ని నమ్ముకొని సినిమాకు మరిన్ని కోట్లు ఖర్చుపెట్టడం అవివేకం అని భావిస్తోంది యూనిట్. అందుకే అంతా మాట్లాడుకొని ఈ సినిమాను పక్కనపెట్టినట్టు తెలుస్తోంది. డియర్ కామ్రేడ్ మేనియా ముగిసిన తర్వాత విజయ్ దేవరకొండ దీనిపై ఓ ప్రకటన చేయబోతున్నాడు.
ఇక "డియర్ కామ్రేడ్"... బాలీవుడ్లో రీమేక్ కానుంది. మంచి ఎమౌంట్కి అగ్ర నిర్మాత కరణ్ జోహర్ హక్కులను తీసుకున్నాడు. కరణ్ జోహర్కి ప్రత్యేకంగా షో వేసి చూపించాడు విజయ్ దేవరకొండ. అలాగే బాలీవుడ్ జర్నలిస్ట్లకి ఇంటర్వ్యూలు కూడా ఇచ్చాడు. దాంతో కరణ్ జోహర్ బాలీవుడ్ ఎంట్రీ ఖాయమైంది అని అందరూ అంచనాలు వేస్తున్నారు. కానీ విజయ్ దేవరకొండ మాత్రం ఇపుడిపుడే బాలీవుడ్కి వెళ్లే ఆలోచనలో లేడు.
డియర్ కామ్రేడ్ హిందీ రీమేక్లో తాను నటించబోవడం లేదని ముందే క్లారిటీ ఇచ్చాడు. ఆ రీమేక్ వేరే బాలీవుడ్ హీరోతో కరణ్ జోహర్ ప్లాన్ చేస్తున్నాడట. బాలీవుడ్లో నటించమని ఆఫర్లు వచ్చిన మాట నిజమే కానీ ప్రస్తుతం టాలీవుడ్పైనే ప్రధానంగా ఫోకస్ పెట్టాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఐతే సౌత్ మొత్తం మార్కెట్ పెంచుకోవాలనేది ప్లాన్ చేసుకుంటున్న మాట నిజమేనని అంగీకరించాడు.