వైఎస్ జగన్ సీఎం కావాలని ఓటేసిన వారిలో యాభై శాతం పైగా కోరుకున్నారు. 86 శాతం సీట్ల వాటా కట్టబెట్టారు. అందుకే చరిత్రలో కనీ వినీ ఎరుగని విజయం జగన్ సొంతమైంది. జగన్ సైతం భారీ విజయాన్ని ఆస్వాదిస్తూనే జనాలకు మరింత చేరువ అయ్యేందుకు తన హామీలను దూకుడుగా నెరవేరుస్తున్నారు. రెండు నెలల జగన్ పాలన బాగుందన్న టాక్ ఓ వైపు వినిపిస్తోంది.


ఇదిలా ఉండగా, జగన్ సీఎం కావడం టాలీవుడ్ జనాలకు అసలు ఇష్టం లేదని థ‌ర్టీ యియర్స్ ఇండస్ట్రీ ప్రుధ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. జగన్ ముఖ్యమంత్రిగా అధికారంలోకి రావడం ఎందుకో వారికి అసలు గిట్టటడంలేదేమోనని అనుమానాలు కూడా అయన వ్యక్తం చేశారు. దానికి అనేక ఉదాహరణలు కూడా ఆయన చెప్పుకొచ్చారు. జగన్ సీఎం అయ్యాక కనీసం టాలీవుడ్ పెద్దల నుంచి ఒక్క అభినందన కూడా రాలేదని ప్రుధ్వీ గుర్తు చేశారు.


జగన్ తో మాకేంటి పని అన్నట్లుగానే టాలీవుడ్ బడా బాబుల తీరుగా ఉందని ఆయన అంటున్నారు. అదే టీయారెస్  నేతల వెనకాల మాత్రం టాలీవుడ్ బాగా పడుతోందని ఆయన అన్నారు.  మొన్న కేటీయార్ పుట్టిన రోజు జరిగితే పోటీలు పడి మరీ ఆయన్ని అభినందించిన టాలీవుడ్   కళ్ళ ముందే జగన్ అంతటి ఘనమైన విజయం సాధిస్తే మాత్రం నోరు తెరచి గ్రీట్ చేయలేకపోయిందని వైసీపీకి గట్టి  మద్దతుదారుడైన ప్రుధ్వీ తెగ ఫీల్ అవుతున్నారు.



అసలు సినిమా వాళ్ళకు జనాలు ఓటు వేయవద్దంటూ కూడా ప్రుధ్వీ పిలుపు ఇచ్చారు. సినిమా వాళ్ళను నమ్ముకోవద్దని కూదా ఆయన ఘాటు వ్యాఖలు చేశారు. ప్రజల కోసం పనిచేసేది నిజమైన తెర వెనక  నాయకులేనని, వారిని జనం ఆదరించాలని కూడా ఆయన కోరుతున్నారు. ఇది ఓ విధంగా వైసీపీ సినీ జనాలను కూడా ఇబ్బంది పెట్టే కామెంటే మరి.ఇక తాను కోరుకోకపోయినా శ్రీ వెంకటేశ్వర భక్తి చానల్ చైర్మన్ పదవిని జగన్ ఇచ్చారని ఆయన ఆశయాలకు అనుగుణంగా తాను సమర్ధంగా పనిచేస్తానని ప్రుధ్వీ అన్నారు.


ఇక అమరావతిలో మరో 30 ఏళ్ల పాటు ఎగిరేది కచ్చితంగా వైసీపీ జెండా అని కూడా ఆయన ధీమాగా చెప్పారు. మొత్తానికి టాలీవుడ్ తనని పట్టించుకోనందుకు జగన్ ఫీల్ అవుతున్నారో లేదో కానీ ప్రుధ్వీ మాత్రం చాలా బాధపడుతున్నట్లే వుంది మరి.



మరింత సమాచారం తెలుసుకోండి: