ఒకప్పుడు వరుస విజయాలు.. ఒకదాని తర్వాత మరొకటి సినిమాలు చేస్తూ బిజీ బిజీగా గడిపేవాడు టాలీవుడ్ మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను. గత సంక్రాంతి కానుకగా విడుదలైన 'వినయ విధేయ రామ' తర్వాత ఆయన.. బాలయ్య తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించినప్పటికీ, అది కార్యరూపం దాల్చేలా లేదు. దీంతో ఈ స్టార్ డైరెక్టర్ ఖాళీగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో అల్లు అరవింద్.. త్వరలోనే బోయపాటితో సినిమా చేస్తున్నామంటూ ప్రకటించిన విషయం తెలిసిందే.


అయితే ఈ సినిమా ఏ హీరోతో ఉంటుందన్నది మాత్రం క్లారిటీ లేదు.ఇటీవల కార్తికేయ హీరోగా నటించిన ‘గుణ 369' ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో అల్లు అరవింద్ కీలక ప్రకటన చేశారు. ఈ కార్యక్రమంలో బోయపాటిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ ‘‘ఈ ఫంక్షన్‌కు శిష్యుడి కోసం వచ్చిన బోయపాటి గారికి అందరూ ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. బోయపాటి, అల్లు అరవింద్ ల కాంబినేషన్ లో సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు వెల్లడించాడు.


తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ‘జాగ్వార్'తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కర్నాటక మాజీ సీఎం కుమారుడు నిఖిల్ గౌడతో బోయపాటి సినిమా తీయబోతున్నారని తెలుస్తోంది. ఈ సినిమా రెండు భాషల్లో తెరకెక్కనుందని అంటున్నారు. కన్నడంలో మాస్ సినిమాలు బాగా చూస్తారనే ఉద్దేశ్యంతోనే బోయపాటిని ఎంచుకున్నారని టాక్.


ఈ కాంబినేషన్‌ను సెట్ చేసింది అల్లు అరవిందేనని తెలుస్తోంది. గతంలో ఎప్పుడో కుమారస్వామికి ఆయన ఇచ్చిన హామీ మేరకు ఈ సినిమాను తీసుకు వస్తున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుందని కూడా వార్తలు వస్తున్నాయి. ఇందులో పలువురు ప్రముఖులు నటిస్తారని వినికిడి. మరి ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: