అఖిల్, హలో , మిస్టర్ మజ్ను సినిమాలతో వరుసగా హ్యాట్రిక్ పరాజయాలను చవిచూశాడు యంగ్ హీరో అఖిల్ అక్కినేని. మిస్టర్ మజ్ను తరువాత కొంచెం గ్యాప్ తీసుకొని అఖిల్ ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో తన నాల్గవ సినిమా లో నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యింది. ఇక ఈ చిత్రంలో అఖిల్ జోడీగా నటించనుంది అని కొన్ని పేర్లు తెర మీదకు వచ్చాయి. అందులో కన్నడ బ్యూటీ రష్మిక మందన్న ఆలాగే బాలీవుడ్ హీరోయిన్ కియరా అద్వానీ పేర్లు ప్రముఖంగా వినిపించాయి. అయితే చిత్ర యూనిట్ అవన్నీ రూమర్లే అని తేల్చింది.
కాగా ప్రస్తుతం ఈ చిత్రానికి హీరోయిన్ ను ఎంపిక చేసే పనిలో ఉన్నారట మేకర్స్. అందులో భాగంగా అఖిల్ కు జోడీగా మలయాళీ భామ ప్రియాంక అరుళ్ మోహన్ పేరు ను పరిశీలిస్తున్నారని సమాచారం. ప్రస్తుతం ప్రియాంక, నాని నటిస్తున్న'గ్యాంగ్ లీడర్' చిత్రంతో తెలుగులోకి ఎంట్రీ ఇస్తుంది. నిన్నటి తో ఆమె ఈ సినిమా షూటింగ్ ను కూడా పూర్తి చేసింది. ఇక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న అఖిల్ 4 కి గోపి సుందర్ సంగీతం అందించే అవకాశాలు వున్నాయి.
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ ఫై బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా కెరీర్ లో మొదటి విజయం కోసం ఎదురుచూస్తున్న అఖిల్ ఈ సినిమా ఫై భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఇక అఖిల్ తోపాటు డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ కు కూడా ఈచిత్రం కీలకం కానుంది. బొమ్మరిల్లు , పరుగు తరువాత భాస్కర్ కూడా ఫామ్ కోల్పోయాడు. మరి ఈ చిత్రంతోనైనా అఖిల్ , భాస్కర్ హిట్లు కొట్టి బౌన్స్ బ్యాక్ అవుతారో లేదో చూడాలి.