వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు వెర్షన్ తొలి వారం పూర్తి చేసుకుని రెండో వారంలోకి అడుగుపెట్టింది. ఆదివారం ఈ షో నుంచి హేమ ఎలిమినేట్ కావడంతో ఆమె స్థానంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తమన్నా సింహాద్రిని నాగార్జున షోలోకి ఆహ్వానించారు. ఆమెను బిగ్ బాస్ హౌస్లోకి రావడం చూసి ఆశ్చర్యపోయారు కంటెస్టెంట్స్. ఇక వచ్చీ రావడంతోటే గేమ్ మొదలు పెట్టింది తమన్నా. ఇక తాజాగా సోమవారం ఈవారం ఎలిమినేషన్స్లో భాగంగా నామినేషన్స్ నిర్వహించారు.
ఒక్కో కంటెస్టెంట్ను కన్ఫ్యూజన్ రూంకి పిలిచి, ఇద్దరి పేర్లను నామినేట్ చేయాల్సిందిగా కోరారు. అయితే ఈ వారమే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా తమన్నాను నామినేట్ చేయడానికి వీలు లేదని కండీషన్ పెట్టారు. అలాగే నామినేషన్ ప్రక్రియ గురించి వేరే ఇంటి సభ్యుడితో చర్చించకూడదని బిగ్బాస్ వెల్లడించారు. అనూహ్యంగా నిబంధనను పాటించని కారణంగా వితికా నామినేషన్ చేయడానికి అనర్హురాలిగా ప్రకటించారు.
అయితే ఈ నామినేషన్ల ప్రక్రియలో బాబా భాస్కర్ అక్కడ ఉన్న ఇంటి సభ్యుల హృదయాలతో పాటు ప్రేక్షకుల హృదయాలు దోచుకున్నారు. బాబా భాస్కర్ను ఇద్దరు ఇంటి సభ్యులను నామినేట్ చేయమంటే.. వచ్చిన వారం రోజుల్లో ఏం అర్థం చేసుకుని నామినేట్ చేయాలని.. కావాలంటే తనను నామినేట్ చేసుకోండని అన్నారు. చివరకు ఏదోలా నామినేషన్ల ప్రక్రిమ ముగిసింది. నామినేషన్ ప్రక్రియలో శ్రీముఖి, హిమజ, జాఫర్, మహేష్, వరుణ్, వితిక, పునర్నవి, రాహుల్లు ఈవారం ఎలిమినేషన్కి నామినేట్ అయ్యారు.
ఎక్కువగా శ్రీముఖి, హిమజలకు 5 ఓట్లతో నామినేట్ అయ్యారు. అయితే ఈ వారంలో వీరిద్దరే టార్గెట్ అవ్వడంతో ఎవరు వెళ్లారు? అన్న ప్రశ్న అందరిలోనూ ఉంది. మరి శ్రీముఖికి ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉండడంతో హిమజ ఎలిమినేట్ అవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఇది ఎంత వరకు నిజం అవుతుందో ఆదివారం వరకు వేచి చూడాల్సి ఉంది.