మెగాస్టార్ జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా ఎంతపెద్ద హిట్ కొట్టిందో తెలిసిందే. భారీ వర్షాల్లో కూడా సినిమా చూసేందుకు పెద్ద సంఖ్యలో థియేటర్ల వద్ద జనాలు పెద్ద క్యూలు కట్టారు అంటే అర్ధం చేసుకోవచ్చు. మెగాస్టార్ చిరంజీవికి గొప్ప పేరు తీసుకొచ్చిన సినిమా ఇది. ఇందులో శ్రీదేవి హీరోయిన్. ఇంద్రుడి కూతురు ఇంద్రజగా నటించింది. ఫాంటసీ సినిమా కావడంతో ఆసక్తి నెలకొంది.
అయితే, సినిమా కథలో మెగాస్టార్ ను, శ్రీదేవిని ఎక్కడ కలపాలి అనే దానిపై పెద్ద చర్చలు జరిగాయి. మాములు సినిమా ప్రకారం మానససరోవరంలో మెగాస్టర్ ను శ్రీదేవి కలుస్తుంది. కానీ, దానికంటే ముందు అంటే సినిమా ప్రారంభం ముందు కథ గురించి అనేక తర్జన భర్జనలు జరిగాయి. మొదట అనుకున్న కథ అది కాదట.
బేబీ షామిలికి దెబ్బ తగిలితే నయం చేయడానికి డబ్బు కావాలి. అదే సమయంలో ఇండియన్ స్పేస్ మిషన్ వాళ్ళు చంద్రునిపైకి స్పేస్ షిప్ ను పంపాలని అనుకుంటుంది. ఆ స్పేస్ షిప్ లో ప్రయాణించే సాహసవంతుల కోసం ప్రకటన ఇస్తుంది. ఈ ప్రకటన చూసిన మెగాస్టార్, ఆ స్పేస్ షిప్ లో ప్రయాణించేందుకు ఒప్పుకుంటాడు. స్పేస్ షిప్ లో చందమామ మీదకు వెళ్తాడు. అక్కడకు శ్రీదేవి తన చెలికత్తెలతో రావడం.. అదే సమయంలో తన ఉంగరం పోగొట్టుకోవడం.. జరుగుతుంది.
ఆ ఉంగరం కోసం ఆమె భూమిమీదకు మెగాస్టార్ ను వెతుక్కుంటూ వస్తుంది. ఇది మొదటి అనుకున్న కథ. కథ విన్నతరువాత మెగాస్టార్, స్పెస్ షిప్, సైన్స్ తో కూడిన వ్యవహారం ఎందుకులే అని చెప్పి మానస సరోవరం ఐడియా చెప్పారట. అది అందరికి నచ్చడంతో.. కథలో మార్పులు జరిగాయి. సినిమా బంపర్ హిట్ అయ్యింది. చిరంజీవి ఐడియా జగదేక వీరుడు అతిలోక సుందరి విజయంలో కీలకంగా మారింది.