జబర్దస్త్ అనేది కామెడీ షో కాదు. దీని వల్ల తెలుగు సినిమా ఇండస్ట్రీకి చాలా మంది కొత్త నటీనటులు పరిచయం అయ్యారు. కమెడియన్లు అనే కంటే కూడా మంచి నటులే ఇండస్ట్రీకి వచ్చారు. వాళ్లు సినిమాలతో కూడా బిజీగా ఉన్నారు. ఒక్కొక్కరు కామెడీ ఆర్టిస్టులుగానే కాకుండా హీరోలు కూడా అవుతున్నారు.
ఇప్పటికే చమ్మక్ చంద్ర, ధన్ రాజ్, రంగస్థలం మహేష్ లాంటి వాళ్లు హీరోలుగా చేసారు. ఇక ఇప్పుడు సుడిగాలి సుధీర్ కూడా హీరో అవుతున్నాడు. సుడిగాలి సుధీర్ జబర్ధస్త్ షోకే కాకుండా ‘ఢీ’ వంటి రియాల్టీ షోకు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. ప్రస్తుతం సుడిగాలి సుధీర్ హీరోగా రాజశేఖర్ రెడ్డి పులిచర్ల దర్శకుడిగా ప్రముఖ పారిశ్రామిక వేత్త కే.శేఖర్ రాజు ప్రొడక్షన్ నెం. 1గా ‘సాఫ్ట్వేర్ సుధీర్’ అనే సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో సుడిగాలి సుధీర్ సరసన ధన్యా బాలకృష్ణ హీరోయిన్గా నటించింది.
ఈ చిత్రం కోసం ప్రజా గాయకుడు గద్దర్ ఒక పాటను రచించి పాడటమే కాకుండా.. ఆ సాంగ్లో నటించడం విశేషం. ఈ చిత్రంలో ప్రముఖ నటి ఇంద్రజ, షాయాజీ షిండే, శివ ప్రసాద్, పోసాని కష్ణమురళి ముఖ్య పాత్రల్లో నటించారు. ఇప్పటికే షూటింగ్ పార్ట్ చివరి దశకు చేరుకున్న ఈ సినిమాను త్వరలో విడుదల చేయడానికి సన్నహాలు మొదలైయ్యాయి.
ఈ సందర్భంగా ప్రజా గాయకుడు గద్దర్ మాట్లాడుతూ - ''సాఫ్ట్వేర్ సుధీర్ చిత్రంలో 'మేలుకో రైతన్నా.. మేలుకో.. నువ్వు కోలుకో రైతన్నా.. కోలుకో' అనే పాటను రచించి పాడాను. అలాగే సినిమాలోని ఆ పాటలో నేను నటించడం కూడా జరిగింది. యువతరాన్ని రైతాంగంతో కలిసి నడవమని చెప్పే మంచి పాటను రాసి నటించే అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్ శేఖర్ రాజు, దర్శకుడు రాజశేఖర్గారికి వందనాలు. రైతుల గురించి మంచి సందేశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం రేపు ప్రజల్లోకి వెళ్లి ఆ రైతాంగాన్ని కదిలిస్తుందని నమ్ముతున్నానన్నారు.
మరోవైపు హీరో హీరో సుడిగాలి సుధీర్ మాట్లాడుతూ - ''కథ చాలా ఎగ్జయిటింగ్గా అనిపించించి ఈ క్యారెక్టర్ చేయడానికి అంగీకరించాను. నా తల్లితండ్రులు చేసిన పూజల ఫలితంగానే హీరోగా నేను నటిస్తున్న మొదటి సినిమాకే ఇంత గొప్ప టెక్నిషియన్స్తో కలిసి వర్క్ చేసే అవకాశం దొరికింది. మా సినిమాలో గద్దర్ వంటి ప్రముఖ గాయకుడు పాట పాడడం, నటించడం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా తప్పకుండా మీ అందరి అంచనాలను అందుకుంటుందన్నారు.