ప్రభాస్ సాహో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చురుగ్గా సాగుతున్నాయి. ఈ సినిమా ఆగష్టు 30 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. వచ్చే నెల 15 వ తేదీ నుంచి సాహో ఆడియో, ప్రచార కార్యక్రమాలు, ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. తెలుగు రాష్ట్రాలలో సాహో వేడుకలను నిర్వహిస్తారట. అలానే, బెంగుళూరు, కేరళ, చెన్నై, ముంబై, డిల్లి నగరాల్లో సాహొ సినిమాకు సంబంధించిన ప్రచార వేడుకలను నిర్వహించాలని డిసైడ్ అయ్యారు.
సాహో మూవీ షూటింగ్ ఎక్కువగా అబుదాబి నగరంలో జరిగింది. అక్కడ ఎత్తైన బిల్డింగ్ ల మధ్య.. సాహసోపేతమైన ఛేజింగ్ లతో షూటింగ్ చేశారు. ఇక అక్కడే ఎడారి ప్రాంతంలో క్లైమాక్స్ ఫైట్ ను చిత్రీకరించారు. అయితే, అబుదాబి నగరంలో కాదట. అలాంటి నగరాన్ని కొత్తగా సృష్టించారు. బాహుబలి సినిమాలో మాహిస్మతి సామ్రాజ్యాన్ని సృష్టించినట్టుగా, బ్యాట్ మ్యాన్ సినిమాలో గోథం సిటీని సృష్టించినట్టుగా సాహో సినిమా కోసం ఓ నగరాన్ని సృష్టించారట.
ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ దాదాపు రెండేళ్లపాటు కష్టపడి అబుదాబి ఎడారి ప్రాంతంలో ఈ నగరాన్ని నిర్మించారు. వండర్ విమెన్, అవెంజర్స్ ఏజ్ అఫ్ అల్ట్రాన్ సినిమాలకు విజువల్ ఎఫెక్ట్స్ సూపర్ వైజర్ గా పనిచేసిన డానిలో బోలెటినో ఆధ్వర్యంలో నగరానికి విజువల్ ఎఫెక్ట్స్ జోడించి రియాలిటీ నగరంగా తెరపై చూపిస్తున్నారు. అబుదాబిలో నిర్మించిన ఈ కొత్త కల్పిత నగరానికి ఇంకా పేరు పెట్టలేదు. దీనికోసం దాదాపుగా రూ. 65 కోట్ల రూపాయాలు ఖర్చు చేశారు.
ఇందులో యాక్షన్ సీన్స్ కోసమే ఏకంగా 90 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. దాదాపు 40 నిమిషాల సేపు ఈ మూవిలో యాక్షన్ ఎపిసోడ్స్ వీనుల విందుగా ఉంటాయని సమాచారం. శ్రద్ధా కపూర్ ఇందులో పవర్ ఫుల్ కాప్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రెండు సింగిల్స్ రిలీజ్ అయ్యాయి. ఫస్ట్ సాంగ్ పార్టి సాంగ్ కాగా, రెండో పాట లవ్ థీం సాంగ్.