స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమా కొత్త షెడ్యూల్ కాకినాడలో ప్రారంభమైంది. ఈ షూటింగ్ నిమిత్తం బుధవారం కాకినాడ చేరుకున్న అల్లు అర్జున్‌కు ఆయన అభిమానులు ఘనస్వాగతం పలికారు. బైకులతో ర్యాలీగా తీసుకొచ్చారు. ఆయనపై పూల వర్షం కురిపించారు. బన్నీ‌తో కరచాలనం చేసేందుకు ఆయన అభిమానులు ఉత్సాహం చూపించారు. బన్నీ రాకతో బుధవారం కాకినాడ నగరం సందడిగా మారింది. రోడ్డు ఇరువైపులా అల్లు అర్జున్‌కు స్వాగతం పలుకుతూ లెక్కలేనన్ని బ్యానర్లు వెలిశాయి సిటీ లో.


కాగా, అల్లు అర్జున్ కాకినాడలో 10 రోజులు గడపనున్నారు. ఇక్కడి పోర్ట్, మార్కెట్ ఏరియాలో ప్రధానమైన యాక్షన్ ఎపిసోడ్‌ను చిత్రీకరించనున్నారు. ఈ రెండు లోకేషన్లతో పాటు రంగరాయ మెడికల్ కాలేజ్, బీచ్ రోడ్‌లో కూడా కొన్ని సన్నివేశాలను చిత్రీకరిస్తారు. ఈ షెడ్యూల్‌లో హీరోయిన్ పూజా హెగ్డే కూడా పాల్గొంటున్నారు. 10 రోజులపాటు ఈ షెడ్యూల్ సాగుతుంది. ఈ 10 రోజుల్లో 4 రోజులపాటు ఫిషింగ్ హార్బర్, మార్కెట్‌లో యాక్షన్ ఎపిసోడ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. 


]ఇది బన్నీకి 19వ సినిమా. ఇంకా టైటిల్ ఖరారు చేయలేదు. అయితే తాజాగా ఈ సినిమా టైటిల్‌ ‘నేను నాన్న’ అంటూ ఫిలింనగర్‌లో ప్రచారం జరుగుతోంది. మరోసారి ఫాదర్‌ సెంటిమెంట్‌తో తెరకెక్కిస్తున్న సినిమా కావటంతో ఈ టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది. పూజా హెగ్డేతో పాటు నివేతా పేతురాజ్ మరో హీరోయిన్‌గా నటిస్తున్నారు. టబు, జయరాం, సుశాంత్‌, మురళీ శర్మ, హర్షవర్థన్, నవదీప్‌లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్‌, హారిక హాసిని క్రియేషన్స్‌ బ్యానర్లపై అల్లు అరవింద్, ఎస్.రాధాకృష్ణ (చినబాబు) సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి విడుదల చేయాలని చూస్తున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: