కన్నడ సినిమాల ద్వారా వెండి తెరకు పరిచయమైన రష్మిక మందన్న వరుసగా క్రేజీ ఆఫర్స్ దక్కించుకుంటూ ప్రస్తుతం ఉన్న హీరోయిన్స్ అందరికి చెక్ పెడుతోంది. నాగ శౌర్య హీరోగా నటించిన “ఛలో” సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన రష్మిక మొదటి సినిమాతోనే సూపర్ హిట్ ను అందుకుంది. ఆ తరువాత విజయ్ దేవరకొండ హీరోగా, డైరెక్టర్ పరుశురాం తెరకెక్కించిన “గీతగోవిందం” సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకుంది. ఆ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. అయితే నాని సరసన “దేవదాసు” సినిమాలో నటించగా ఆ సినిమా మాత్రం యావరేజ్ టాక్ సొంత చేసుకొని పర్వాలేదనిపించింది. ఇక తాజాగా మరో సారి విజయ్ తో చేసిన “డియర్ కామ్రేడ్” డీసెంట్ కలెక్షన్స్ సాధిస్తూ ముందుకెళుతోంది.

అటు కన్నడ లో చూసినా, ఇటు తెలుగులో చూసినా రష్మిక చేసిన సినిమాలు దాదాపు విజయం సాధిస్తున్నాయి. దీనితో రష్మికకు పరిశ్రమలో లక్కీ గర్ల్ అనే సెంటిమెంట్ బాగా వర్కౌట్ అవుతోంది. టాలెంట్ కి మించి సెంటిమెంట్ కి ప్రాధాన్యం ఉండే సినిమా పరిశ్రమలో అవి రెండు ఉన్న రష్మిక మిగతా హీరోయిన్స్ ని వెనక్కి తోసి  దూసుకుపోతుంది. ఇప్పటికే స్టార్ హీరో మహేష్ సరసన “సరిలేరు నీకెవ్వరూ” సినిమాలో నటిస్తున్న రష్మిక, అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో రానున్న సినిమాలోను నటించే అవకాశం దక్కించుకుంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలున్నాయి.

వీటితో పాటు యంగ్ హీరో నితిన్ కి జోడీగా “భీష్మ” సినిమాతో పాటు, తమిళంలో కార్తీ హీరోగా తెరకెక్కనున్న సినిమాలో కూడా రష్మిక నటిస్తున్నారు. అంతేకాదు స్టార్ హీరో తలపతి విజయ్ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ గా రష్మిక పేరు పరిశీలనలో ఉందని కోలీవుడ్ మీడియా సమాచారం. దీంతో  రష్మిక స్పీడ్ చూస్తుంటే టాలీవుడ్ లో తక్కువ కాలంలోనే నెంబర్ వన్ పొజిషన్ కి చేరుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక టాప్ హీరోయిన్స్ గా క్రేజ్ సంపాదించుకుంటారనుకున్న నివేదా థామస్, శాలిని పాండే, అనుపమ పరమేశ్వరన్ ఈ రేస్ లో లేకపోవడం ఇప్పుడు అందరిని ఆశ్చర్య పరుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: