తెలుగు బుల్లితెరపై తొలుత చిన్న చిన్న కార్యక్రమాల ద్వారా ప్రవేశించిన యాంకర్ రష్మీ, ఆ తరువాత తన ఆకట్టుకునే పెర్ఫార్మన్స్ తో మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందిపుచ్చుకుంటూ ముందుకు సాగారు. ఇక ఆపై ఆమె కొన్ని సినిమాల్లో కూడా నటించడం జరిగింది. ఆమె నటించిన గుంటూరు టాకీస్, నెక్స్ట్ ఏంటి సినిమాల్లోని ఆమె పాత్రలకు మంచి గుర్తింపు కూడా లభించడం జరిగింది. ఇక ప్రస్తుతం ఈటివి ఛానల్ లో ప్రసారం అవుతున్న జబర్దస్త్ తో పాటు ఢీ జోడి షోలకు యాంకర్ గా వ్యవహరిస్తున్న రష్మీ, అతి త్వరలో డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి అడుగుపెట్టనున్నట్లు సమాచారం. 

అదేనండి వెబ్ సిరీస్ లోకి అన్నమాట. ఇప్పటికే కొందరు సినిమా నటులు వెబ్ సిరీస్ ల ద్వారా వీక్షకులను అలరిస్తున్నారు. ఇటీవల రామ్ గోపాల్ వర్మ, కియారా అద్వానీ, రాధికా ఆప్టే, సీనియర్ నటి అమల వంటి వారు వెబ్ సిరీస్ మాధ్యమాల్లో అడుగుపెట్టి మంచి ప్రశంశలు అందుకున్న విషయం తెలిసిందే. ఇకపోతే ఇటీవల 'ఏ ఫిలిం బై అరవింద్' సినిమా దర్శకుడు శేఖర్ సూరి, ఒక అద్భుతమైన స్టోరీని రష్మీకి వినిపించడం జరిగిందని, ఆ స్టోరీని తాను అనుకున్నట్లుగా పలు భాగాలుగా చిత్రికరిస్తే తప్పకుండా మంచి సక్సెస్ సాదిస్తుందనే నమ్మకం ఉందని ఆయన అన్నారట. అయితే సూరి చెప్పిన కథ, రష్మీకి బాగా నచ్చి, ఆయనకు డేట్స్ కూడా కేటాయించడం జరిగిందని టాలీవుడ్ వర్గాల సమాచారం.

వెబ్ సిరీస్ లో అయితే సెన్సార్ కట్స్ అనేవి ఉండవు కాబట్టి, ఆ స్టోరీని తాను అనుకున్న విధంగా తెరకెక్కించాలని సూరి భావిస్తున్నట్లు సమాచారం. అంతేకాక టాలీవుడ్ కి చెందిన ఒక సీనియర్ హీరో ఇందులో ఒక ముఖ్యపాత్రలో కూడా కనపడనున్నారట. ప్రస్తుతం పలు మీడియా మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న ఈ వార్తపై ఇప్పటివరకు రష్మీ నుండి గాని, దర్శకుడు శేఖర్ సూరి నుండి గాని ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఒకవేళ ఈ వార్త నిజమే అయితే మాత్రం రష్మీ ఫ్యాన్స్, ఆమెను ఇకపై వెబ్ సిరీస్ లో కూడా వీక్షించే అవకాశం దొరుకుతుంది.....!!


మరింత సమాచారం తెలుసుకోండి: