నాగార్జున ప్రస్తుతం మన్మధుడు -2 సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నాడు. ఆయన నానితో కలిసి నటించిన "దేవదాస్" తర్వాత చేస్తున్న చిత్రమిది. దేవదాస్ అనుకున్నంత విజయం సాధించలేదు. ఇప్పుడు మన్మధుడు-2 సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. గతంలో నాగార్జున ఏ సినిమాకి రానంత బజ్ ఈ సినిమాకి వచ్చింది. టీజర్ ,ట్రైలర్లు ఈ సినిమాపై ఆసక్తిని మరింతగా పెంచాయి.
అయితే మన్మధుడు-2 సినిమాకి ముందు నాగార్జున తమిళంలో ధనుష్ దర్శకత్వంలో ‘రుద్ర’ అనే మల్టీస్టారర్ మూవీకి సంతకం చేశాడు. నిజానికి సూపర్ స్టార్ రజనీకాంత్ చేయాల్సిన పాత్ర అది. ఆయన డేట్స్ కుదరకపోవడంతో నాగార్జునను సంప్రదించారు. నాగ్ ఓకే చెప్పడంతో షూటింగ్ మొదలెట్టేసారు. ధనుష్. ఎస్జే సూర్య.. అదితిరావు హైదరి.. అరవింద్ స్వామి లాంటి ఇంట్రెస్టింగ్ కాస్టింగ్ తో ఈ చిత్రం ఆసక్తి రేకెత్తించింది.
రూ.70 కోట్ల బడ్జెట్లో ఈ సినిమాను తెరకెక్కించడానికి ప్లాన్ చేసుకున్నారు.ఈ సినిమా షూటింగుకి కూడా నాగ్ హాజరయ్యాడు. నాగ్ కెరీర్లో ఇదో ప్రత్యేకమైన సినిమా అవుతుందని చర్చ జరిగింది. తెలుగు తమిళ భాషల్లో ఏక కాలంలో రిలీజ్ అయ్యే ఈ సినిమాతో నాగ్ కి చాలా మంచి పేరు వస్తుందని అనుకున్నారు. ఐతే ఏమైందో ఏమో ఉన్నట్లుండి ఈ సినిమాకు బ్రేక్ పడింది. దీనిపై చిత్ర బందంలో ఎవరూ ఏమీ మాట్లాడలేదు. నాగ్ కూడా దీని గురించి ఇప్పటిదాకా స్పందించలేదు.
ఐతే తాజాగా 'మన్మథుడు-2' ప్రమోషన్ల కోసం మీడియాను కలిసిన నాగ్.. ధనుష్ సినిమా ప్రస్తావన తెచ్చాడు. ఆ సినిమా ఆగిపోవడం తనకు కూడా పెద్ద షాక్ అని చెప్పాడు. ‘‘ధనుష్తో నా తమిళ సినిమా రద్దయ్యింది. ఆ ప్రాజెక్టునే పూర్తిగా ఆపేశారు. దాదాపు 35 రోజులు షూట్ కూడా చేశారు. ఆ తర్వాత ఏమైందో తెలియదు. నేను షాక్ అయ్యా.’’ అని నాగ్ చెప్పాడు. మరి తర్వాతైనా ఈ సినిమా ఉంటుందా లేదా అనేది సందేహమే?