బిగ్ బాస్ హౌస్ లో ప్రొఫెషనల్ గా, అగ్రెసివ్ గా కనిపించే జాఫర్ 1976 ఆగస్టు 15 న నెల్లూరులో సందానీబాషా, నూర్జహాన్ దుంపతులకు మూడో సంతానంగా జన్మించారు. డిగ్రీ వరకు నెల్లూరులోనే చదువుకున్న జాఫర్ చిన్నప్పుడే వామపక్ష భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. డీవైఎఫ్ ఐ లో కొద్ది రోజులు క్రియాశీలకంగా పనిచేశాడు. పెద్దక్క రిహాన ముప్పయ్యేళ్ళ క్రితం చేసుకున్న ఇంటర్ రిలీజెస్ మ్యారేజ్ జాఫర్ లో చిన్నప్పుడే సామాజిక స్పృహ రావడానికి కారణమైంది. బావ కుటుంబంతో సన్నిహితంగా మెలగడం సమాజంలో జరుగుతున్న సామాజిక వివక్షతని చిన్నప్పుడే అర్థం చేసుకోడానికి కారణమైంది. ఇదంతా వృత్తిపరంగా అతను చేసే స్టోరీలు, ఇంటర్వ్యూ లో స్పష్టంగా కనిపించేది.
జాఫర్ జర్నలిజంలో అ,ఆ లు దిద్దింది ఆంధ్రజ్యోతిలోనే.1995లో స్ట్రింగర్ గా నెల్లూరులో మొదలైన జాఫర్ ప్రస్తానం నాలుగేళ్ల పాటు కొనసాగింది. ఆ తరువాత పాపులర్ టీవీలో హైదరాబాద్ ఇన్ చార్జి గా రెండేళ్లు. మాటీవీ లో క్రైమ్ బ్యూరో చీఫ్ గా రెండేళ్లు పని చేసిన అనుభవం. ఆ తర్వాత టీవీల్లో చేరిక రెండు వేల నాలుగులో రాయలసీమ బ్యూరో ఇన్ చార్జిగా, రెండు వేల ఐదు లో వైజాగ్ బ్యూరో ఇన్ చార్జి గా, రెండు వేల ఆరులో విజయవాడ బ్యూరో చీఫ్ గా పని చేసిన జాఫర్, 2007 లో ఇన్వెస్టిగేషన్ బ్యూరోకు హైదరాబాదుకు వెళ్లారు.రెడ్ లైట్ ఏరియాలకు అమ్మాయిలను అమ్మేస్తున్న వైనంపై జాఫర్ చేసిన పరిశోధాత్మక కథనాలు ప్రొఫెషనల్ లైఫ్ లో ఒక మైలురాయిలాంటిది.
ఈ కథనాలకు అప్పటి ముఖ్యమంత్రి స్పందించి బాధితులుని బంధ విముక్తిల్ని చేశారు.ఆ సందర్భంగా ఈ ఆపరేషన్ జరిపిన తీరు మీద రాసిన పుస్తకం ఆపరేషన్ రెడ్ లైట్ అందర్నీ ఆకట్టుకోవడమే కాక అందరినీ ఆలోచింపచేసింది. వృత్తిలో జర్నలిస్టులు ఎదుర్కొనే ఇబ్బందులపై రాసిన పుస్తకం ఆఫ్ ది రికాడ్ చాలామంది మన్ననల్ని పొందింది. మూఢనమ్మకాలు, నకిలీ స్వామీజీలు, బాబాలు అవినీతి అక్రమాలపై జాఫర్ అత్యధికంగా స్టింగ్ ఆపరేషన్లు చేశారు. 2015 లో మొదలైన ముఖాముఖీ టాక్ షో జాఫర్ కు మంచి గుర్తింపు తెచ్చింది. ప్రొఫెషనల్ గా అగ్రెసివ్ గా కనిపించే జాఫర్, బిగ్ బాస్ లోకి వెళ్తున్నారని తెలిసి ఈ షో ఎలా ఉండబోతుందో అని చాలా మంది ఆసక్తిగా ఎదురు చూశారు.
వృత్తిపరంగా అగ్రెసివ్ గా కనిపించే జాఫర్ వ్యక్తిగత జీవితంలో దానికి భిన్నంగా ఉంటారు. సౌమ్యుడిగా కొంత సున్నిత మనస్కుడిగా జాఫర్ రియల్ లైఫ్ లో వుంటారనే సంగతి ఆయన ఇంటి సభ్యులకు ఆప్తులకు తప్ప ఇంకెవరికీ తెలియదు. బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టాక ఇదే తీరులో కనిపించిన జాఫర్ హౌస్ మేట్స్ ని ఆశ్చర్యానికి గురిచేశాడు. జాఫర్ గేమ్ ప్లాన్ లో ఇది భాగమా.? లేక ఇలాగే ఉండాలని నటిస్తున్నారా.? అని ఒక అభిప్రాయానికి రాలేక హౌస్ మేట్స్ మొదట్లో అంటీ అంటనట్లు ఉన్నారు. తన స్నేహం కోరి వచ్చే వారితో ఎక్కువ అటాచ్మెంట్ పెంచుకోవడం వల్ల జాఫర్ తో కొద్ది రోజులు మిగతా హౌస్ మేట్స్ తో గ్యాప్ రావడానికి కారణమైంది.
అలాగే జాఫర్ చేసిన ఇంటర్వ్యూల కారణంగా ఒక్కొక్కరు ఒక్క అభిప్రాయంతో ఉన్న హౌస్ మేట్స్ మధ్య వివాదాలు సృష్టించటానికే జాఫర్ ని బిగ్ బాస్ హౌస్ లోకి పంపారని తొలుత భావించారు.తరువాత బాబా భాస్కర్ తో సరదాగా ఉంటున్న వైనం, వివాదాలకు కాస్త దూరంగా వుండే తత్వం, క్రమంగా హౌస్ మేట్స్ కి కూడా నచ్చింది. కింగ్ సర్వెంట్ టాస్క్ లో మగవారు ఆడవాళ్ళ వేషధారణలో వేసే స్కిట్ లో తాను పాల్గొనబోనని జాఫర్ ఖరాకండిగా చెప్పడం తోటి కంటెస్టెంట్ లకు నచ్చలేదు. ఇలా చేస్తే బయట జనాలు తనను హర్షించరని చెప్పడం అక్కడి వాతావరణంలో హీట్ పెంచింది. ఈ అభిప్రాయంతో చాలా మంది కంటెస్టంట్ లు ఏకీభవించలేదు.
అప్పుడే తమన్నా కూడా స్క్రిప్ట్ పట్ల అభ్యంతరం వ్యక్తం చేయడం తమన్నాకి వరుణ్ సందేశ్ మద్దతు తెలపడం వివాదాన్ని రాజేసింది. ఆ సమయంలో కింగ్ పాత్రలో ఉన్న అలీని ఈ స్కిట్ ఇంతటితో ఆపేద్దాం. అంతకు ముందు సీజన్ లో ట్రాన్స్ జెండర్ లేరు కాబట్టి ఇటువంటి స్కిట్ లు వేసి ఉంటారు. ఇప్పుడు వద్దని విన్నవించడం కొంతమందికి రుచించ లేదు. ఓ దశలో హోమ్ సిక్ అయిన జాఫర్ భార్యను తలచుకుని ఎమోషనల్ అవడం ఆయన ఎలిమినేషన్ కు మరో కారణమైంది అన్న చర్చ కూడా ఇప్పుడు నడుస్తుంది. జాఫర్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చాక ఒకట్రెండ్రోజులు రిజర్వుడుగా కనిపించినా ఆ తర్వాత హౌస్ మేట్స్ అందరికీ ఇష్టమైన వ్యక్తిగా మారాడు.