ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు లాభసాటిగా, సేఫ్ జోన్ లో ఉండే సినిమాలు ఏవి అంటే బయోపిక్ లు అనే చెప్పొచ్చు. కథ కోసం వెతుక్కునే అవసరం లేదు. కథకు కాస్త క్యూరియాసిటీ జోడించి తీస్తే చాలు బాక్సాఫీస్ వద్ద కనకవర్షం కురుస్తుంది. ఇలా ఎన్నో సినిమాలు బాలీవుడ్ లో వచ్చి సూపర్ హిట్ కొట్టాయి. ముఖ్యంగా స్పోర్ట్స్ పర్సన్స్ స్టోరీస్ తో తీసిన సినిమాలు అద్భుతం అని చెప్పొచ్చు.
స్పోర్ట్స్ స్టోరిలకు ఎక్కువ డిమాండ్ ఉన్నది. స్పోర్ట్స్ పర్సన్స్ తరువాత హిస్టారికల్ పర్సన్స్, రాజకీయ నాయకుల జీవిత చరిత్రల ఆధారంగా వచ్చే సినిమాలకు మంచి ఆదరణ లభిస్తోంది. ఇదే కోవలో ఇప్పుడు ఓ బయోపిక్ రాబోతున్నది. దేశరాజకీయాల్లో తనదైన ముద్రను వేసిన నేత, బీజేపీ నాయకురాలు సుష్మాస్వరాజ్ జీవితం ఆధారంగా సినిమాను తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఇందులో సుష్మా పాత్రకు బాలీవుడ్ నటి తాప్సి నటిస్తున్నట్టు తెలుస్తోంది. తాప్సి మంచి టాలెంటెడ్ ఉన్న నటే అందులో సందేహం లేదు. కానీ, సుష్మా స్వరాజ్ పాత్రకు సెట్ అవుతుందా అన్నది సందేహం. ప్రస్తుతం ఈ బయోపిక్ గురించి వస్తున్న వార్తలు అన్ని కేవలం ఊహాగానాలే. కథ రెడీ కావడానికి ఇంకా సమయం పడుతుంది. తాప్సినే మెయిన్ లీడ్ రోల్ చేస్తుంది అనుకుంటే.. దానికి తగ్గట్టుగా ఆమెను మార్చుకోవచ్చు.
అయితే, చిన్నమ్మ జీవితం ఆధారంగా సినిమా చేయడానికి బీజేపీ ఒప్పుకుంటుందా అన్నది చూడాలి. బీజేపీలో ఆమె స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరు. బీజేపీ పార్టీ ఎదుగుదలలో ఆమె కృషి ఎనలేనిది. వాజ్ పాయికి ప్రియశిష్యురాలిగా పేరు తెచ్చుకున్న సుష్మా స్వరాజ్ ఆగస్టు 5 వ తేదీన హఠాత్తుగా గుండెపోటుతో మరణించారు. ఇది బీజేపీకి తీరని లోటుగా చెప్పొచ్చు.