గ్రేటర్ హైదరాబాద్ లో స్వచ్ఛ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు నగరవాసులను చైతన్యపర్చేందుకు ప్రత్యేకంగా 2వేల మంది కమ్యునిటి రిసోర్స్ పర్సన్ లను నియమిస్తున్నట్టు జిహెచ్ఎంసి కమిషనర్ ఎం.దానకిషోర్ ప్రకటించారు. సాఫ్, షాన్ దార్ హైదరాబాద్ కార్యక్రమం, వాక్ నిర్వహణపై జిహెచ్ఎంసి యు.సి.డి అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులతో నేడు సాయంత్రం జలమండలి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో కమిషనర్ దానకిషోర్ తో పాటు అడిషనల్ కమిషనర్లు శృతిఓజా, సిక్తాపట్నాయక్, జలమండలి ఈ.డి సూర్యనారాయణలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో ప్రస్తుతం రోజుకు 4,700లకు పైగా మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుందని, దీనిని కనీసం సగానికి తగ్గించేందుకు గాను సేంద్రీయ ఎరువుల తయారీ, తడి, పొడి చెత్త వేరు చేయడం, చెత్తను స్వచ్ఛ ఆటోలకు అందించడం తదితర కార్యక్రమాల పట్ల నగరవాసులను చైతన్యం చేయడానికి ప్రత్యేకంగా 2వేల మంది సి.ఆర్.పి లను నియమించడానికి అనుమతించాల్సిందిగా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని పేర్కొన్నారు.



నగరంలో 1,090 స్లమ్ లేవల్ ఫెడరేషన్లు ఉన్నాయని, ఈ ఎస్.ఎల్.ఎఫ్ ప్రతినిధుల ద్వారా నగర సమస్యలను సేకరించి వాటిని పరిష్కరించేందుకు ప్రత్యేక మానిటరింగ్ వ్యవస్థను జిహెచ్ఎంసి, జలమండలిలో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. నగరంలో గత మూడు నెలలుగా 150 డివిజన్లలో నిర్థారించిన ప్రత్యేక లొకేషన్లలో నిర్వహిస్తున్న సాఫ్ హైదరాబాద్ షాన్ దార్ హైదరాబాద్ కార్యక్రమంతో సత్ఫలితాలు వస్తున్నందున ఈ కార్యక్రమాన్ని నగరం మొత్తానికి విస్తరిస్తున్నట్టు కమిషనర్ దానకిషోర్ ప్రకటించారు. సాఫ్ హైదరాబాద్ షాన్ దార్ హైదరాబాద్ కార్యక్రమం నిర్వహణపై నిన్న జరిగిన జిహెచ్ఎంసి సర్వసభ్య సమావేశంలో కూడా పలువురు ప్రజాప్రతినిధులు ప్రశంసించారని, ఈ కార్యక్రమాన్ని మొత్తం వార్డుల్లో చేపట్టాలని కార్పొరేటర్లు కోరుతున్నందున మొత్తం హైదరాబాద్ కు విస్తరిస్తున్నట్టు తెలిపారు.


ఇప్పటి వరకు ప్రయోగాత్మకంగా నిర్వహించిన ఈ సాఫ్, షాన్ దార్ హైదరాబాద్ ను మరో సంవత్సరం వరకు పొడిగిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమానికి నియమించిన స్వచ్ఛంద సంస్థలు, స్థానిక స్వయం సహాయక మహిళా బృందాలతో సమన్వయంతో కలిసి స్వచ్ఛ కార్యక్రమాలు, నీటి వృథాను తగ్గించడానికి కృషి చేయాలని స్పష్టం చేశారు. గ్రేటర్ హైదరాబాద్ లో ప్రతిరోజు పది శాతం నీరు అంటే 16కోట్ల లీటర్ల నీరు వృథాగా పోతుందని, ఈ నీటి వృథాను తగ్గించేందుకు, స్వచ్ఛ కార్యక్రమాలపై నగరవాసుల్లో చైతన్యం కల్పించేందుకు ప్రముఖ నటుడు విజయ్ దేవరకొండ ముందుకు వచ్చారని దానకిషోర్ వెల్లడించారు. రోజుకు 25 కిలోల చెత్తను ఉత్పత్తిచేసే వారిని బల్క్ గార్బేజ్ ప్రొడ్యూసర్లుగా ప్రకటించనున్నామని తెలిపారు. నగరంలో స్వచ్ఛ ఆటోలను స్వయం సహాయక మహిళా బృందాల ద్వారా కొనుగోలు చేయించి వినియోగించుకునేందుకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామని పేర్కొన్నారు. గ్రేటర్ లో స్వచ్ఛ ఉల్లంఘనులను గుర్తించి వారికి గత రెండు నెలల్లో రికార్డు స్థాయిలో కోటి రూపాయలకు పైగా జరిమానాలు విధించామని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: