డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ లో ఉండగా వచ్చిన అవకాశంతో ఉయ్యాలా..జంపాలా సినిమా ద్వారా టాలీవుడ్ కు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు యంగ్ హీరో రాజ్ తరుణ్. ఆ తర్వాత కుమారి 21 ఎఫ్, సినిమా చూపిస్త మావా సినిమాలతో వరుసగా హిట్స్ ని అందుకున్నాడు. కానీ ఆ తర్వాత రాజ్ తరుణ్ సినిమాలేవి పెద్దగా సక్సస్ కాలేదు. కంటిన్యూస్ గా ఫ్లాప్స్ వచ్చిపడ్డాయి. అంతేకాదు దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన లవర్ కూడా సరిగ్గా ఆడలేదు. దాంతో కొన్నాళ్ళు ఏ సినిమా కమిటవకుండా బ్రేక్ ఇచ్చాడు. అయితే ఈ బ్రేక్ లో కొన్ని మంచి కథలు ఎంచుకున్నాడట. ఆ సమయంలో దాదాపు పది కథలు విన్నాడట రాజ్ తరుణ్. అందులో 'ఇద్దరి లోకం ఒకటే' కథ బాగా నచ్చడంతో ముందుగా అదే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

ప్రస్తుతం 'ఇద్దరిలోకం ఒకటే' షూటింగ్ దాదాపు కంప్లీట్ కావచ్చిందని లేటెస్ట్ న్యూస్. ఇంతక ముందు సుధీర్ బాబుతో 'ఆడు మగాడ్రా బుజ్జి' సినిమాను తీసిన దర్శకుడు జి.ఆర్.కృష్ణ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. 'అర్జున్ రెడ్డి' 118 లో నటించిన షాలిని పాండే హీరోయిన్ గా రాజ్ తరుణ్ సరసన నటిస్తోంది. ఇక త్వరలోనే సినిమాకు సంబంధించి ప్రమోషన్స్ మొదలు పెట్టనున్నారట చిత్ర బృందం. ఇప్పటికే టైటిల్ ఆకట్టుకుంటున్న ఈ సినిమా లో రాజ్ తరుణ్-షాలిని పాండే జంట కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం చాలా ధీమాగా ఉన్నారట. ఇక ఈ ఇద్దరు జతకడుతున్నారనగానే ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి బాగానే పెరిగింది.

ఈ సినిమా రిలీజ్ అవగానే విజయ్ కుమార్ కొండ సినిమాను స్టార్ట్ చేస్తాడు రాజ్ తరుణ్. నితిన్ తో గుండె జారి గల్లంతయ్యిందే, నాగ చైతన్య తో ఒక లైలా కోసం వంటి క్యూట్ లవ్ స్టోరీస్ ని తెరకెక్కించిన ఈ దర్శకుడి పై రాజ్ తరుణ్..తనకు హిట్టిస్తాడని గట్టి నమ్మకంతో ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు ఈ సినిమాతో పాటే అన్నపూర్ణ స్టూడియో బ్యానర్ లో నాగార్జున నిర్మాతగా మరో సినిమా కూడా స్టార్ట్ చేస్తాడని తెలుస్తుంది. ఇవి కాకుండా దర్శకుడు మారుతి నిర్మాణంలో కూడా ఒక సినిమా చేయాల్సి ఉందని సమాచారం. పది నెలలు బ్రేక్ తీసుకున్నప్పటికి ఇలా బ్యాక్ టు బ్యాక్ ఆఫర్స్ తో రాజ్ తరుణ్ మళ్లీ యంగ్ హీరోలకు పోటీగా పుంజుకోవడం ఖాయమని ఫిల్మ్ నగర్‌లో చెప్పుకుంటున్నారు. మరి ఇప్పటి నుంచైనా రాజ్ తరుణ్ కంటిన్యూస్ గా హిట్స్ ని సొంతం చేసుకుంటాడో లేదో చూడాలి.



మరింత సమాచారం తెలుసుకోండి: