ప్రస్థానం సినిమాతో డైరెక్టర్ దేవా కట్టా పేరు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కసారిగా మార్మోగిపోయింది. ఆ సినిమా శర్వానంద్, సాయి కుమార్ కు విపరీతమైన క్రేజ్ ని తీసుకువచ్చింది. ఇక మెగా హీరో సాయిధరమ్ తేజ్ ప్రస్తుతం రెండు సినిమాలు లైన్లో పెట్టుకున్నాడు. మారుతి డైరక్షన్ లో ప్రతిరోజు పండుగే సినిమా చేస్తున్న తేజ్ తరువాత రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. భోగవిల్లి ప్రసాద్ నిర్మాతగా కొత్త దర్శకుడితో ఒక సినిమా కాగా, భగవాన్ - పుల్లారావు నిర్మాతలుగా దేవాకట్టాతో మరొక సినిమాని ఒకే చేశాడు. అయితే ఈ రెండింటిలో ఏ సినిమా ముందు స్టార్ట్ అవుతుందన్నది మాత్రం మరికొద్ది రోజుల్లో తేలబోతోందని సమాచారం.

ఆటోనగర్ సూర్య తరువాత దేవాకట్టా తెలుగులో సినిమా చేయలేదు. అందుకు ముఖ్య కారణం ఆ సినిమా పెద్ద డిజాస్టర్ గా మిగలడమే. అయితే బాహుబలి వెబ్ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ కోసం చేసి బిజీగా గడిపాడు. అంతేకాదు ప్రస్థానం సినిమాను హిందీలో రీమేక్ చేస్తున్నారు. సంజయ్ దత్ తనే హీరోగా ఈ సినిమాను స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. వాస్తవంగా ఈ సినిమా ఎప్పుడో మొదలవ్వాల్సింది. కానీ అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. అయినప్పటికి ఇటీవల విడుదలయిన ప్రస్థానం హిందీ ట్రైలర్ కు మంచి పేరు వచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే దేవాకట్టా మళ్లీ జనాలకు గుర్తుకు వచ్చేలా చేసింది.

ఈ సినిమా తరువాత దేవాకట్టా మళ్లీ తెలుగులో సినిమా చేయబోతున్నారు. ఆ సినిమానే సాయితేజ్ హీరోగా భగవాన్-పుల్లారావు నిర్మించే సినిమా. ఈ నిర్మాతలు కూడా చాలా కాలం తర్వాత మళ్ళీ సాయితేజ్-దేవాకట్టా కాంబినేషన్ లో సినిమాను నిర్మిస్తుండటం ఇప్పుడు ఆసక్తిగా మారింది.  మరి ఈ కాంబినేషన్ లో వచ్చే సినిమా కథ కథనాల గురించి ఇంకా ఎలాంటి సమాచారం అయితే లేదు. అంతేకాదు హీరోయిన్..ఇతర నటీ నటులు..సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడించబోతున్నారని తెలుస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: