యంగ్ హీరో శర్వానంద్ హీరోగా వస్తోన్న యాక్షన్ డ్రామా 'రణరంగం'. సుధీర్ వర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో కాజల్ అగర్వాల్, కళ్యాణి ప్రియదర్శిని హీరోయిన్లుగా నటించారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో తెరకెక్కిన ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్పై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్టు 15న రిలీజ్ అయిన ఈ సినిమాకు ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్లు కంప్లీట్ అయ్యాయి. ఫస్ట్ షో టాక్ ప్రకారం సినిమాలో శర్వానంద్ నటించిన గ్యాంగ్స్టర్ రోల్ చాలా కొత్తగా ఉందట.
ఇప్పటి వరకు శర్వాను లవర్ బాయ్ ఇమేజ్తో చూసిన వారు ఈ గ్యాంగ్స్టర్ రోల్లో చూడడం కొత్తగా ఉందని ప్రశంసిస్తున్నారు. సినిమాలో ఎమోషన్స్ కూడా బాగా పండాయంటున్నారు. ఇక భిన్నమైన భావోద్వేగాలతో కూడిన కథ, కథనం ఈ సినిమాకు ప్లస్ పాయింట్లుగా ప్రేక్షకులు చెపుతున్నారు. ఇక శర్వా ఈ సినిమాతో సరికొత్త నటన చూపించాడని.. హీరోయిన్లు కాజల్ అగర్వాల్, కల్యాణి ప్రియదర్శన్ పాత్రలు కథానుగుణంగా సాగుతూ ఆకట్టుకున్నాయని కామెంట్స్ చేస్తున్నారు.
దర్శకుడు సుధీర్వర్మ సినిమాలో ప్రతి రోల్ను చాలా స్పెషల్గా డిజైన్ చేశాడని... నేపథ్య సంగీతం సినిమా ప్రధాన హైలెట్స్లో ఒకటిగా నిలిచిందని కితాబు ఇస్తున్నారు. సినిమాలోని కొన్ని డైలాగులతో పాటు ఇంటర్వెల్ బ్యాంగ్, ప్రీ క్లైమాక్స్ ఆకట్టుకున్నాయంటున్నారు. 1990 నేపథ్యంలో సాగిన కథకు, ప్రస్తుత కాలంలోని సన్నివేశాలకు మధ్య సాగే స్క్రీన్ ప్లే సినిమాకు మరో ప్రధాన బలంగా చెపుతున్నారు.
ఏదేమైనా ప్రీమియర్ షో టాక్ తర్వాత సినిమాకు మంచి టాక్ వస్తోంది. మరి సినిమా పూర్తి రిజల్ట్ ఏంటో మరి కాసేపట్లో తేలిపోనుంది. ఇక ఈ రోజే ఈ సినిమాకు పోటీగా వచ్చిన అడవి శేష్ థ్రిల్లర్ మూవీ ఎవరు కూడా హిట్ టాక్ తెచ్చుకుంది.