ఊహించినట్లుగానే అల్లు అర్జున్ 19వ చిత్రానికి అచ్చమైన తెలుగు టైటిల్ ను పెట్టాడు డైరెక్టర్ త్రివిక్రమ్. ఈచిత్రానికి 'అల.. వైకుంఠపురములో.. ' అనే టైటిల్ ను ఖరారు చేశారు. అయితే ఒకరోజు ముందుగానే ఈ టైటిల్ బయటకు లీక్ అవ్వడం బన్నీ అభిమానులను నిరాశపరించింది. నిన్నటి నుండే ఈ టైటిల్ సోషల్ మీడియా లో వైరల్ అయ్యింది. కాగా ప్రస్తుతం ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. అందులో భాగంగా ఇటీవల కాకినాడ లో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను తెరకెక్కించారు. త్వరలోనే కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అల్లు అర్జున్ కొత్త లుక్ లో కనిపించనున్నాడు.
ఇక ఈ సినిమాలో దువ్వాడ జగన్నాథం తరువాత బన్నీ తో రెండవ సారి జోడి కడుతుంది ముంబై బ్యూటీ పూజా హెగ్డే. ఆమెతోపాటు సీనియర్ నటి టబు, మురళి శర్మ , జయరాం , సుశాంత్ , నవదీప్ , నివేత పేతురాజు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్ల ఫై రాధాకృష్ణ , అల్లు అరవింద్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈసినిమాను వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు.
త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ కు ఇది మూడో సినిమా. ఇంతకుముందు వీరి కాంబినషన్ లో తెరకెక్కిన జులాయి ,సన్ అఫ్ సత్యమూర్తి సినిమాలు మంచి విజయాలు సాధించాయి. కాగా అరవింద సమేత తో హిట్ కొట్టి త్రివిక్రమ్ ఫామ్ లోకి రాగ... నా పేరు సూర్య తో పరాజయాన్ని చవిచూశాడు బన్నీ. మరి ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న ఈ అల.. వైకుంఠపురములో.. ఎలాంటి ఫలితాన్ని రాబట్టుకుంటుందో చూడాలి.