టాలీవుడ్ సినిమా పరిశ్రమకు హీరో రామ్ సరసన నటించిన నేను శైలజ సినిమాతో పరిచయం అయిన కీర్తి సురేష్, తొలి సినిమాతోనే తన అందం మరియు అభినయంతో తెలుగు ప్రేక్షకుల గుండెల్లో మంచి స్థానం సంపాదించింది. అలానే నాని సరసన నేను లోకల్, ఆపై పవన్ కళ్యాణ్ సరసన అజ్ఞాతవాసి సినిమాల్లో నటించిన ఈ భామ, అనంతరం ఏకంగా ఒకప్పటి దిగ్గజ నటి దివంగత సావిత్రిగారి జీవిత చరిత్ర ఆధారంగా తీసిన మహానటి సినిమాలో సావిత్రి గారి క్యారెక్టర్లో నటించే అద్భుత ఛాన్స్ దక్కించుకుంది. 

అయితే మొదట్లో అంత గొప్ప మహానటి జీవిత చరిత్ర సినిమాకు తాను న్యాయం చేయలేనని భావించి ఆ అవకాశాన్ని వద్దనుకున్న కీర్తి, ఆపై కొంత పునరాలోచించి చివరకు నటించడానికి ఒప్పుకున్నారు. అనుకున్న విధంగా వైజయంతి మూవీస్ బ్యానర్ పై నాగ అశ్విన్ దర్శకత్వంలో ఆ సినిమా అద్భుతంగా తెరకెక్కడం, ఆపై మంచి హైప్ తో రిలీజ్ అయిన సినిమా, ప్రేక్షకుల అంచనాలు అందుకుని తెలుగు మరియు తమిళ భాషల్లో సూపర్ సక్సెస్ ని సాధించడంతో, కీర్తిని అందరూ మహానటి అని పిలవడం మొదలెట్టారు. ఇకపోతే మొన్న మహానటి సినిమాలో అద్భుత నటనకు గాను కీర్తికి ఏకంగా జాతీయ అవార్డు వరించడంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండాపోయాయి. 

ఇక ప్రస్తుతం ఖతార్ లో జరుగుతున్న సైమా అవార్డుల వేడుకకు హాజరైన కీర్తి సురేష్, ఆ వేడుకలకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన మెగాస్టార్ చిరంజీవి గారి కాళ్ళ మీద పడి వారి ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటో ప్రస్తుతం పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది. ఇటీవల జాతీయ అవార్డు అందుకున్న కీర్తి గురించి ఎంత చెప్పినా తక్కువే అని, మహానటి సినిమాలో కీర్తి నటించింది అని అనడం కంటే జీవించింది అంటూ మెగాస్టార్ ఆమెపై పొగడ్తలు కురిపించినట్లు తెలుస్తోంది....!! 

మరింత సమాచారం తెలుసుకోండి: