ఇస్మార్ట్ శంకర్ సినిమా విజయంతో మంచి జోరు మీదున్న పూరి జగన్నాథ్ తన తర్వాతి సినిమాను ప్రకటించేశాడు. డియర్ కామ్రేడ్ సినిమాతో పరాజయాన్ని మూటగట్టుకున్న విజయ్ దేవరకొండతో ఈ సినిమా ఉంటుందని అధికారికంగా ప్రకటించాడు. మాస్ మసాలా సినిమాలు తీయడంలో దిట్ట అయిన పూరి జగన్నాథ్ ఈ సినిమాని ఏ రేంజ్ లో తెరకెక్కిస్తారనే ఊహాగానాలు ఎక్కువయ్యాయి. ఈ క్రేజీ కాంబినేషన్ గురించి ఇప్పటీకే ఒక రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు.


అయితే ఇస్మార్ట్ విజయం తర్వాత మాస్ మసాలా సినిమాలు మాత్రమే తీస్తానని ప్రకటించిన పూరి జగన్నాథ్ విజయ్ కోసం మాస్ మసాలా స్క్రిప్ట్ ని రెడీ చేస్తున్నాడట. ఈ చిత్రాన్ని పూరి కనెక్ట్స్ బ్యానర్ లో నిర్మిస్తుండగా సహ నిర్మాతగా ఛార్మీ కౌర్ వ్యవహరిస్తుంది. అయితే ఈ సినిమా లో ఎవరెవరు నటిస్తారనే విషయం ఇప్పటి వరకు బయటకి రాలేదు. అయితే విజయ్ సరసన ఏ హీరోయిన్ నటించనుందనే వార్త హాట్ టాపిక్ గా మారింది.


పూరీ జగన్నాథ్ - విజయ్ దేవరకొండ సినిమాలో ఎవరూ ఊహించని ఓ హీరోయిన్‌ను నటింపజేస్తున్నారని తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు.. అలనాటి అందాల తార శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్. అందంలో తల్లికి ఏమాత్రం తీసిపోనంతగా ఉండే ఈ అమ్మడు.. తొలి సినిమాలోనే నటనతో మెప్పించి విమర్శకుల ప్రసంశలు అందుకుంది. ఈ ఊపులోనే మరికొన్నిసినిమాలకూ సంతకాలు చేసేసింది.


కొద్దిరోజుల క్రితం జరిగిన ఓ ఇంటర్వ్యూలో జాన్వీ కపూర్ తెలుగులో మీకు నచ్చిన హీరో ఎవరు అని అడిగిన ప్రశ్నకు విజయ్ దేవరకొండ అని టక్కున సమాధానం చెప్పేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు జాన్వీ ఈ సినిమాలో తన అభిమాన హీరోతో నటించబోతుందన్న మాట. ఇంతకీ ఈమెను సెట్ చేసింది మరెవరో కాదు.. చిత్ర నిర్మాతల్లో ఒకరైన ఛార్మీ కౌర్ అనే టాక్ వినిపిస్తోంది. జెట్ వేగంతో సినిమాలు తీసే పూరి, ఈ సినిమాని ఎప్పుడు విడుదల చేస్తాడనే విషయం చెప్పలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: