జులాయి, సన్నాఫ్ సత్యమూర్తిలాంటి హిట్ సినిమాల తరువాత అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతోన్న సినిమా అల...వైకుంఠపురములో. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. అల్లు అర్జున్ కు జోడీగా ఈ సినిమాలో పూజా హెగ్డే కనిపిస్తుండగా నివేతా పేతురాజ్ కూడా మరో ముఖ్య పాత్రలో నటిస్తోంది. వీరిద్దరితో పాటు నిహారిక కూడా ఈ సినిమాలో నటించబోతుందని తెలుస్తోంది. 
 
ఒకమనసు సినిమాతో హీరోయిన్ గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన నిహారికకు తొలి సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ఆ తరువాత నిహారిక హ్యాపీ వెడ్డింగ్, సూర్యకాంతం సినిమాల్లో నటించినప్పటికీ ఈ సినిమాలు కూడా ప్లాప్ అయ్యాయి. నిహారిక నటనకు మంచి పేరే వస్తున్నా సినిమాలు మాత్రం హిట్ అవ్వట్లేదు. ప్రస్తుతం నిహారిక అక్టోబర్ 2వ తేదీన విడుదల కాబోతున్న సైరా నరసింహారెడ్డి చిత్రంలో ముఖ్య పాత్రలో నటిస్తోంది. 
 
సైరా నరసింహారెడ్డి సినిమాతో పాటు త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న అల.. వైకుంఠపురములో సినిమాలో కూడా నిహారిక ముఖ్య పాత్రలో నటిస్తోందని తెలుస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు చెల్లెలిగా నిహారిక కనిపించబోతుందని సమాచారం. సినిమాను మలుపు తప్పే కీలకమైన పాత్ర నిహారికది అని తెలుస్తోంది. అక్కినేని హీరో సుశాంత్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నాడు. 
 
మరి హీరోయిన్ గా సక్సెస్ అందుకోని నిహారికకు ఈ పాత్రలు ఎలాంటి గుర్తింపునిస్తాయో చూడాలి. అల్లు అర్జున్ ఈ సినిమాలో మధ్య తరగతి ఫ్యామిలీకి చెందిన అబ్బాయిగా కనిపిస్తున్నాడు. అల్లు అర్జున్ తండ్రిగా మురళీ శర్మ నటిస్తున్నాడు. 2020 సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్, హారిక హాసిని క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. 80 కోట్ల రుపాయల బడ్జెట్ తో నిర్మాతలు ఈ సినిమాను నిర్మిస్తున్నారని సమాచారం. 




మరింత సమాచారం తెలుసుకోండి: