డ్రగ్స్ ఇష్యూ టాలీవుడ్లో తీవ్ర ప్రకంపనలు రేపింది. డ్రగ్స్ ముఠాకు టాలీవుడ్లో పలువురు ప్రముఖులకు లింక్ ఉందన్న ఆరోపణలు, సిట్ ఇంటరాగేషన్లతో ఏకంగా మూడు నెలల పాటు టాలీవుడ్ చుట్టూ డ్రగ్స్ ఉందంతం నడిచింది. పోలీసులు, ఆరోపణలు ఇలా మీడియాలో ఎక్కడ చూసినా ఇదే హైలెట్ అయ్యేది. ఇక టాలీవుడ్ డ్రగ్స్ ఇష్యూ నుంచి కాస్త సైడ్ అయ్యి ఇప్పుడిప్పుడే భారీ సినిమాలతో దేశ స్థాయిలో దూసుకుపోతోంది. ఇక ఇప్పుడు బాలీవుడ్లో డ్రగ్స్ ప్రకంపనలు హాట్ టాపిక్గా మారాయి.
ఇందుకు బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహర్ ఏర్పాటు చేసిన విందు వ్యవహారం ప్రధాన కారణంగా ఉంది. కరణ్ జోహార్ తాజాగా ఏర్పాటు చేసిన పార్టీలో బాలీవుడ్ స్టార్లు అయిన షాహీద్ కపూర్, మీరా రాజ్పుత్, రణ్బీర్ సింగ్, మలైకా అరోరా, వరుణ్ ధావన్, నటాషా దలాల్, అర్జున్ కపూర్, వికీ కౌశల్, జోయా ఆక్తర్, ఆయన్ ముఖర్జీ లాంటి సినీతారలు పాల్గొన్నారు. ఈ పార్టీలో విచ్చలవిడిగా డ్రగ్స్ వాడారంటూ ఎమ్మెల్యే మంజిందర్ ఎస్ సిర్సా తీవ్రంగా ఆరోపణలు చేశారు.
ఈ పార్టీపై ఎమ్మెల్యే చేసిన ఆరోపణలను నార్త్ మీడియా ఇష్టమొచ్చినట్టు ప్రచారం చేసుకుంది. రేటింగ్స్ కోసం ఛానెళ్లు, ఇక పాపులారిటీ కోసం వెబ్సైట్లు రెచ్చిపోయి మరీ వార్తలు వేసేశాయి. ముందుగా ఎమ్మెల్యే మంజిందర్ బాలీవుడ్ స్టార్స్ మత్తులో తూలుతున్నారు.. మీరు ఈ వీడియో చూడండి అసలు నిజం ఏంటో మీకే తెలుస్తుందంటూ ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ తర్వాత కరణ్ మరోసారి మీడియాకు, బీ టౌన్లో కొందరికి టార్గెట్ అయ్యారు.
దీంతో ఆయన వివరణ ఇచ్చుకోక తప్పలేదు. ఈ ఆరోపణలపై ఓ ఇంటర్వ్యూలో కరణ్ మాట్లాడుతూ సినిమా తారలు వారం రోజుల పాటు వరుసగా కష్టపడడంతో వీకెండ్లో ఎంజాయ్ చేసేందుకే వచ్చారు. ఆ వీడియోకు 5 నిమిషాల ముందు కూడా నా తల్లి అక్కడే ఉందని... ఆ పార్టీలో డ్రగ్స్ వినియోగించడం తప్పని తెలియనంత వెధవను కాదని ఘాటుగా తనపై ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు. ఎవరో కొందరు పాపులార్టీ కోసం ఇలా చీప్గా మాట్లాడితే దానిపై తనకు స్పందించాల్సిన అవసరం లేదని కూడా ఆయన కుండబద్దలు కొట్టేశారు. ఏదేమైనా ఈ ఇష్యూ మాత్రం ఇప్పుడు బాలీవుడ్లో ప్రకంపనలు రేపుతోంది.