టాలీవుడ్లో మెగా హీరోలు వర్సెస్ నందమూరి హీరోల మధ్య బాక్సాఫీస్ యుద్ధం జరుగుతుంటే ఆ వార్ మామూలుగా ఉండదు. మెగాస్టార్ చిరంజీవి వర్సెస్ యువరత్న బాలకృష్ణ మధ్య సంక్రాంతి కానుకగా సినిమాలు వచ్చాయంటే ఆ పోటీలో ఉన్న మాజానే వేరుగా ఉండేది. ఆ తర్వాత జనరేషన్ హీరోలు అయిన ఎన్టీఆర్, పవన్, బన్నీ, చెర్రీ సినిమాలు కూడా ఒకేసారి రిలీజ్ అవుతుంటే బాక్సాఫీస్ హీటెక్కుతుంది. ఇక ఇప్పుడు వచ్చే సంక్రాంతికి మెగా హీరో వర్సెస్ నందమూరి హీరో మధ్య పోటీ ఖాయమైనట్టే కనిపిస్తోంది.
2020 సంక్రాంతి బెర్తులు ఒకొక్కటిగా ఫిల్ అవుతున్నాయి. మహేష్ బాబు `సరిలేరు నీకెవ్వరు` సంక్రాంతికే విడుదల అవుతోంది. మరోవైపు అల్లు అర్జున్ `అల వైకుంఠపురములో` కూడా పండక్కే వస్తోంది. ఇక ఇప్పుడు కళ్యాణ్రామ్ సినిమా సైతం పండక్కే రెడీ అయ్యింది. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో 'ఎంత మంచివాడవురా' సినిమా చేస్తున్నాడు కళ్యాణ్ రామ్. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కి రిలీజ్ చేయబోతున్నట్లు అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. తేది చెప్పకుండా రిలీజ్ లాక్ చేసుకున్నారు.
2017 లో ఖైదీ 150, గౌతమి పుత్ర శాతకర్ణి వంటి పెద్ద సినిమాల మధ్య చిన్న సినిమాగా విడుదలై ఘన విజయం సాధించింది శతమానం భవతి.
ఆ సినిమా దర్శకుడే సతీష్ వేగేశన. ఇప్పుడు ఈ సినిమాకు కూడా డైరెక్టర్ కావడం... కుటుంబ కథా చిత్రం కావడంతో ఈ సినిమాపై యూనిట్ కాన్ఫిడెంట్గా ఉంది. ఇక వీరిద్దరికి తోడుగా మహేష్బాబు సరిలేరు నీకెవ్వరు కూడా ఉంది. మరి ఈ రెండు పెద్ద సినిమాలను తట్టుకుని కళ్యాణ్ ఏం చేస్తాడో ? చూడాలి.
టిస్ట్ ఏంటంటే కేఎస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కే బాలయ్య సినిమా సైతం సంక్రాంతికి లైన్లో పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అదే జరిగితే 2015 సంక్రాంతికి నాలుగు సినిమాలు పోటీ పడినట్టే వచ్చే సంక్రాంతికి కూడా బాక్సాఫీస్ హీట్ అదిరిపోతుంది.