కాల్పనిక కథలు ప్రేక్షకులను ఊహాలోకంలో విహరింపజేస్తాయి.. కానీ వాస్తవిక కథలు వారిని ఆలోచింపే జేస్తాయి.. వాస్తవ కథలకు కాస్త కాల్పనికత జోడించి వాస్తవికంగా సినిమాలు తీస్తే ఇప్పుడు జనం బాగా ఆదరిస్తున్నారు. ప్రత్యేకించి విజయగాధలు ఇప్పుడు బాలీవుడ్, టాలీవుడ్ లకు ముడిసరుకుగా మారాయి. నిజ జీవితాన్ని సినిమా తెరపై ఆవిష్కరించడం.. విజేతలు తమ జీవితాల్లో ఎదుర్కొన్న డ్రామాను వెండితెరపై సరిగ్గా తెరకెక్కించగలిగితే కాసుల వర్షమే కురుస్తోంది.
ఎంఎస్ ధోనీ, మిల్కాసింగ్, సూపర్ 30 ఆనంద్, దంగల్.. ఇలాంటివన్నీ నిజ జీవిత కథలే.. ఇప్పుడు అలాంటిదే మరో చిత్రం తయారవుతోంది. భారత ఫుట్బాల్ జట్టుకు కోచ్గా ఎనలేని సేవలు అందించిన వ్యక్తి సయ్యద్ అబ్దుల్ రహీం. ఫుట్బాల్ కోచ్ సయ్యద్ రహీం నాయకత్వంలో 1951, 1962 సంవత్సరాలలో జరిగిన ఆసియా క్రీడల్లో భారత ఫుట్బాల్ జట్టు విజయం సాధించింది. సయ్యద్ అబ్దుల్ రహీం జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు..
ఇప్పుడు ఆయన కథ ఆధారంగా బాలీవుడ్లో ‘మైదాన్’ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ సయ్యద్ అబ్దుల్ రహీం పాత్రలో ఫుట్బాల్ కోచ్గా కనిపించబోతుడున్నాడు. ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్లుక్ను అజయ్ దేవగణ్ సోషల్ మీడియా ద్వారా షేర్ చేశారు. తన సంతోషాన్ని ఫ్యాన్స్ తో పంచుకున్నారు. అయితే ఈ విషయం దాదాపు ఏడాది క్రితమే నిర్మాణ సంస్థ జీ స్టూడియో ప్రకటించినా.. ఆ తర్వాత వివరాలు వెల్లడి కాలేదు. అప్పటి నుంచి డిటైల్స్ కోసం అటు అజయ్ దేవగణ్ ఫ్యాన్స్.. ఇటు ఫుట్బాల్ లవర్స్ ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో అజయ్ తన ట్విటర్లో మైదాన్ మూవీ ఫస్ట్లుక్ను పోస్ట్ చేశాడు.. మైదాన్ కిక్స్ ఆఫ్ టు డే అని ట్వీట్ చేశారు. ఈ సినిమాకు అమిత్ శర్మ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ బయోగ్రాఫికల్ మూవీ వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.