రాబోయే సంక్రాంతికి టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర పెద్ద యుద్ధమే జరిగేటట్లు ఉంది. సంక్రాంతి నీ టార్గెట్ గా చేసుకొని ఇండస్ట్రీలో ఉన్న పెద్ద పెద్ద హీరోలు తమ సినిమాలు విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో మహేష్ బాబు ఇప్పటికే రెండు వరుస బ్లాక్ బస్టర్ సినిమాల తో మంచి జోరు మీద వున్నా మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు సినిమాతో హ్యాట్రిక్ హిట్ కొట్టాలనే ఆలోచనలో ఉన్నాడు. ఇదే క్రమంలో అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్న `అల వైకుంఠపురములో` కూడా సంక్రాంతికి విడుదల కానుంది.
ఇటువంటి తరుణంలో మహేష్.... బన్నీలతో పోటీగా నందమూరి వారసుడు కళ్యాణ్ రామ్ కూడా రెడీ అయ్యాడు. కల్యాణ్ రామ్ కొత్త సినిమా `ఎంత మంచి వాడవురా` ఈ సంక్రాంతికే విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. మెహరీన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రానికి సతీష్ వేగేశ్న దర్శకుడు. జులైలో చిత్రీకరణ మొదలై తొలి షెడ్యూల్ని పూర్తి చేసుకుంది. ఈనెల 27 నుంచి రెండో షెడ్యూల్కి శ్రీకారం చుట్టబోతున్నారు. కుటుంబ బంధాల నేపథ్యంలో సాగే ఫీల్ గుడ్ సినిమా ఇది. సంక్రాంతి పండక్కి కుటుంబ కథా చిత్రాలకు మంచి గిరాకీ ఉంటుంది.
పైగా ఈ సినిమా డైరెక్టర్ సతీష్ వేగేశ్న ఆల్రెడీ `శతమానం భవతి` అనే ఫ్యామిలీ హిట్ సినిమా తన ఖాతాలో వేసుకున్నాడు. అంతేకాకుండా అప్పట్లో `శతమానం భవతి` సంక్రాంతి పండుగకు విడుదలయ్యి రెండు భారీ హిట్ సినిమాల మధ్య పోటీని తట్టుకునే బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు సతీష్ వేగేశ్న. ఇప్పుడు అదే సెంటిమెంట్ తో సంక్రాంతికి విడుదల చేస్తున్నారు. మరి మహేష్ బాబు, అల్లు అర్జున్ సినిమాలకు పోటీకి దిగుతున్న సతీష్ వేగేశ్న సినిమా హిట్ అవుతుందో లేదో చూడాలి.