మెగాస్టార్ చిరంజీవి నటించిన సైరా... నరసింహారెడ్డి టీజర్ ఈరోజే విడుదలైంది. పవన్ కల్యాణ్ వాయిస్ తో ప్రారంభమైన టీజర్లో చరిత్రపుటల్లో కనుమరుగైన వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పాత్రలో నటించిన చిరంజీవి విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. 270 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన సైరా సినిమాకు హిట్ టాక్ వస్తే చాలు రికార్డు స్థాయి కలెక్షన్లు వస్తాయనడంలో ఏ మాత్రం ఆశ్చర్యం లేదు. 
 
సైరా నరసింహారెడ్డి సినిమా తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో విడుదల కాబోతుంది. బాహుబలి, బాహుబలి2 సినిమాల తరువాత వస్తున్న చారిత్రాత్మక చిత్రం కావటం సైరా నరసింహారెడ్డికి ప్లస్ కానుంది. "సింహంలాంటోడు దొర అతడే మాలో ధైర్యం దొర" , "రేనాటి వీరులారా చరిత్రలో మనం ఉండకపోవచ్చు కానీ చరిత్ర మనతోనే మొదలవ్వాలి " లాంటి డైలాగ్స్ ఆకట్టుకున్నాయి. సినిమాలోని యుధ్ధ సన్నివేశాలు ప్రేక్షకుల్ని ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, నయనతార, తమన్నా లుక్స్ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. 
 
దర్శకుడు సురేందర్ రెడ్డి కెరీర్ మొదటి నుండి సాధారణమైన కథలతోనే సినిమాలు తీసాడు. కెరీర్లో మొదటిసారి చారిత్రాత్మక చిత్రానికి దర్శకత్వం వహించిన సురేందర్ రెడ్డి ప్రేక్షకుల అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా సైరాను తెరకెక్కించాడని అర్థమవుతుంది. నిర్మాత రామ్ చరణ్ ఖర్చు విషయంలో ఏ మాత్రం తగ్గకుండా సినిమాను నిర్మించాడు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించిన సైరా చిరంజీవి కెరీర్లో మరపురాని చిత్రంగా నిలిచిపోతుందనటంలో ఏ మాత్రం సందేహం లేదు. సైరా నరసింహారెడ్డి ఖచ్చితంగా మరో బాహుబలి అవుతుందని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. దసరా పండుగ కానుకగా అక్టోబర్ 2 వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతుంది. 




మరింత సమాచారం తెలుసుకోండి: