2020 సంక్రాంతికి పందెం కోళ్ళు సిద్ధమవుతున్నాయి. అయితే ఈ సారి దోబూచులాట బాగా ఎక్కువయిందనిపిస్తోంది. ఇప్పటివరకు మహేష్ బాబు, బన్నీ మాత్రమే బరిలో ఉన్నారు. కానీ బాలయ్య కూడా నేనున్నాను అంటున్నాడు. ఇదిలా ఉండగానే అనూహ్యంగా కళ్యాణ్ రామ్ వచ్చి దూరిపోయాడు. ఓవైపు మహేష్ బాబు సినిమా బరిలో ఉంది. మరోవైపు బన్నీ సినిమా పోటీలో నిలిచింది. సంక్రాంతి బరిలో ఇలాంటి రెండు పెద్ద సినిమాల మధ్య తమ సినిమాను రిలీజ్ చేయాలని మరో హీరో అనుకోడు. మరీ ముఖ్యంగా ఆ స్థాయిలో మార్కెట్ లేని హీరోలు అస్సలు ఆలోచించరు. కానీ కళ్యాణ్ రామ్ మాత్రం పోటీకి సై అన్నాడు. దీంతో ఇండస్ట్రీలో అంతా అవాక్కయ్యారు. బన్నీ, మహేష్ కు పోటీగా కళ్యాణ్ రామ్ రంగంలోకి దిగడాన్ని చాలామంది నమ్మలేకపోయారు. కానీ అతడి ధైర్యం వెనక ఓ వ్యక్తి ఉన్నాడు. అతనే తారక్ అనుకుంటున్నారు..కానీ ఏమాత్రం కాదని క్లారిటి వచ్చేసింది.

కళ్యాణ్ రామ్ నటిస్తున్న 'ఎంతమంచివాడవురా' సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారు. మహేష్, బన్నీ రేసులో ఉన్నారని తెలిసి కూడా వీళ్లు ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణం దిల్ రాజు. ఈ సినిమాను పంపిణీ చేయడానికి దిల్ రాజు ముందుకొచ్చారు. మరీ ముఖ్యంగా సంక్రాంతి సీజన్ లో ఈ సినిమాను విడుదల చేస్తానని ఆయన యూనిట్ కు మాటిచ్చారని తాజా సమాచారం. అందుకే కళ్యాణ్ రామ్ పోటీకి ఏమాత్రం వెనకడుగు వేయకుండా సై అన్నాడు.

దర్శకుడు సతీష్ వేగేశ్న పై దిల్ రాజుకు బాగా నమ్మకం ఉండటమే ఇందుకు ముఖ్య కారణమని తెలుస్తోంది. అతడు తీసిన శతమానం భవతి సినిమా సంక్రాంతి బరిలో నిలిచి సూపర్ హిట్ అయింది. ఆ తర్వాత సతీష్ వేగేశ్న తీసిన మరో సినిమా దిల్ రాజుకు షాక్ ఇచ్చినప్పటికీ.. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న ఎంతమంచివాడవురా ప్రాజెక్టుపై మాత్రం రాజు గట్టి నమ్మకంతో ఉన్నాడు. మరీ ముఖ్యంగా ఈ సినిమాను ఆయన ఔట్ రేట్ కు కొనే ఆలోచనలో కూడా ఉన్నాడట.   

సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు బరిలో ఉన్నప్పటికీ మరో సినిమా పెర్ఫార్మ్ చేయడానికి స్కోప్ ఉంటుందని గతంలో దిల్ రాజే అన్నారు. అదే నమ్మకంతో ఈసారి సరిలేరు నీకెవ్వరు సినిమాతో పాటు కళ్యాణ్ రామ్ సినిమాను కూడా పంపిణీ చేయాలని నిర్ణయించుకున్నారు. దిల్ రాజుకు ఇలా ఒకేసారి 2 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేయడం కొత్తకాదు. కాకపోతే కళ్యాణ్ రామ్ సినిమాపై ఆయన ఎందుకంత నమ్మకం పెట్టుకున్నాడనేదే అందరికీ ఆశ్చర్యం కలిగించే విషయం ఇప్పుడిదే ఫిల్మ్ నగర్ లో హాట్ న్యూస్. 


మరింత సమాచారం తెలుసుకోండి: