మెగా స్టార్ చిరంజీవి (కొణిదెల శివశంకర వరప్రసాద్) `పునాది రాళ్లు` సినిమాతో టాలీవుడ్లోకి అడుగుపెట్టాడు. నేడు ఆయన 64వ జన్మదిన వేడుకలు జరుపుకుంటున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగల్తూరులో 1955 ఆగస్టు 22న ఆయన జన్మించారు. టాలీవుడ్లో పునాది రాళ్లు చిత్రంతో కెరీర్ ప్రారంభించిన చిరంజీవి అంచలంచలుగా ఎదిగారు. ఎన్నో సినిమాల తర్వాత ఎ.కోదండరామి రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఖైదీ సినిమాతో చిరంజీవి ప్రత్యేకమైన గుర్తింపు సాధించారు.
టాలీవుడ్లో ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి టాప్ పొజిషన్ దక్కించుకున్నారు. గ్యాంగ్ లీడర్, రౌడీ అల్లుడు, ఘరానా మొగుడు, కొదమ సింహం, జగదేకవీరుడు అతిలోక సుందరి, హిట్లర్ వంటి వివిధ పాత్రల్లో ప్రేక్షకులను మెప్పించి బాక్సాఫీస్ వద్ద ఆల్ టైమ్ రికార్డులు సృషించారు. అలాగే తెలుగు పరిశ్రమలో చిరంజీవిని మొదటి యాక్షన్ డాన్స్ మాస్ హీరోగా చెప్పుకోవచ్చు. ఆయన 90 దశకంలో చిరు స్టార్ డమ్ ఓ రేంజ్లోకి వెళ్లింది. అలాగే 1992 లో ప్రముఖ ఇంగ్లీష్ మ్యాగజైన్ ది వీక్ చిరు కవర్ పేజీ తో ఓ ఆర్టికల్ ప్రచురించింది.
అదే విధంగా చిరంజీవి హిందీలో ప్రతిబంధ్, ఆజ్ కా గుండా రాజ్, ది జెంటిల్మెన్ వంటి చిత్రాల్లో కూడా నటించాడు. అయితే అప్పట్లోనే చిరంజీవి రెమ్యూనరేషన్ 1.25 కోట్లు తీసుకోవడం ఆశ్చర్యం. వాస్తవానికి బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ రెమ్యూనరేషన్ కంటే ఎక్కువగా ఉండడం విశేషం. ఇదే సమయంలో చిరు 2009లో ప్రజా రాజ్యం అనే పార్టీని స్ఠాపించారు. కానీ రాజకీయంగా అనుకున్న స్టాయిలో ఎదగలేకపోయాడు. ఈ క్రమంలోనే 2011లో తమ పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేశాడు.
అయితే ప్రస్తుతం `సైరా నరసింహారెడ్డి` చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. రూ. 200 కోట్ల భారీ బడ్జెట్తో తెరకెక్కబోతున్న ఈ సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా ఈ సినిమా నిర్మించబడుతుంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి రాం చరణ్ నిర్మాత.