చరిత్ర పుటల్లో కనుమరుగయ్యిపోయిన తెలుగు గడ్డకు చెందిన వీర విప్లవకారుడు “ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి” జీవితం ఆధారంగా మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రుపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానుంది. మొన్న విడుదలైన ఈ సినిమా టీజర్, సినిమా పై అమాంతం అంచనాలను పెంచేసింది. ఇక నిర్మాత రామ్ చరణ్ ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీ పడకుండా అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. మరి అలాంటప్పుడు, ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీ స్థాయిలోనే జరుగుతుంది కదా. మెగా స్టామినాను ఏమాత్రం తక్కువ చెయ్యని రీతీలోనే అన్ని భాషల్లోనూ ఇప్పటికే భారీగా బిజినెస్ ను జరుపుకుంది సైరా. ఈ చిత్రం హక్కులు ఒక్క కన్నడ భాషలోనే 25 కోట్లకు అమ్ముడుపోయినట్టు ఆ మధ్య వార్తలు వచ్చాయి. కానీ దాదాపు 28 కోట్లకు కన్నడ రైట్స్ అమ్ముడుపోయాయట. అంతే కాకుండా సీడెడ్ హక్కులు కూడా భారీ మొత్తంలోనే అమ్ముడుపోయట. సీడెడ్ లో సైరా హక్కులు మొత్తం 22 కోట్లకు అమ్ముడుపోయినట్టు తెలుస్తుంది. బాహుబలి 2, సాహో తర్వాత ఇదే పెద్ద భారీ మొత్తం.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉంది ఈ చిత్రం. ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. రామ్ చరణ్ ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. ఇక నేడు చిరు జన్మదినం సందర్భంగా అటు అభిమానులతో పాటు, ఇటు ఇండస్ట్రీ ప్రముఖులు ఆయనకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలిపారు. నిన్న ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అతిధిగా ఏకంగా ఓ కార్యక్రమాన్ని కూడా నిర్వహించిన సంగతి తెలిసిందే.