ఇటీవల తన కం బ్యాక్ మూవీ అయిన ఖైదీ నెంబర్ 150 సినిమాతో సూపర్ డూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుని, తన స్టామినా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించుకున్న మెగాస్టార్ చిరంజీవి, ప్రస్తుతం సైరా నరసింహారెడ్డి సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమా టీజర్ ఇటీవల యూట్యూబ్ లో రిలీజ్ అయి, ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రాబట్టింది. ఇకపోతే నిన్న ఘనంగా తన 64వ పుట్టినరోజు జరుపుకున్న మెగాస్టార్, మరొక రెండు రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లి గూడెం వెళ్లనున్నట్లు కాసేపటి క్రితం ఒక ప్రకటన వెలువడింది. 

టాలీవుడ్ లో అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ లకు ధీటుగా తన అత్యద్భుత నటనా కౌశలంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న విశ్వ నట చక్రవర్తి శ్రీ ఎస్వీ రంగారావు గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా, మెగాస్టార్ చిరంజీవి ఎల్లుండి, అనగా 25వ తేదీ ఆదివారం నాడు తాడేపల్లి గూడెం వెళ్లనున్నారు. ఈ విగ్రహం ఆవిష్కరణ కోసం మెగాస్టార్ ముందుగా ప్రత్యేక విమానంలో బయలుదేరి ఉదయం 9 గంటలకు గన్నవరం ఎయిర్ పోర్ట్ లో దిగుతారట. అక్కడ నుండి రోడ్డు మార్గాన తాడేపల్లిగూడెం ఉదయం10.15 ని. కు చేరుకుంటారు. అనంతరం ఎస్వీఆర్ గారి విగ్రహావిష్కరణ చేసిన తరువాత, అక్కడి నిర్వాహకులు ఏర్పాటు చేసిన సభలో పాల్గొంటారు. స్వతహాగా ఎస్వీఆర్ గారిని ఎంతో అభిమానించే మెగాస్టార్ చిరంజీవి, మన తెలుగు వారి ఖ్యాతిని విశ్వవ్యాప్తంగా ముందుకు తీసుకువెళ్లిన వారిలో ఎస్వీయార్ గారు కూడా ఒకరని ఇప్పటికే పలు ఇంటర్వ్యూ ల్లో మెగాస్టార్ చెప్పుకొచ్చారు. 

ఇక మెగాస్టార్, తాడేపల్లి గూడెం రానుండడంతో ఇప్పటికే అక్కడి మెగా ఫ్యాన్స్ కు సమాచారం అందించడం జరిగిందట. అలానే భద్రత పరంగా కూడా అక్కడి పొలిసు ఉన్నతాధికారులను సంప్రదించి గట్టి భద్రత ఏర్పాట్లు కూడా చేపట్టినట్లు సమాచారం. ఇక ఈ వార్త కాసేపటి క్రితం వెలువడడంతో, తమ అభిమాన మెగాస్టార్ ను చూడాలని ఆ జిల్లాకు చెందిన పలువురు మెగా ఫ్యాన్స్, సోషల్ మీడియా మాధ్యమాల్లో ఆయనకు ఆహ్వానం పలుకుతూ, ఆనందంతో కామెంట్స్ చేస్తున్నారు....!!    


మరింత సమాచారం తెలుసుకోండి: