టాలీవుడ్లోని స్టార్ డైరెక్టర్లలో పూరీ జగన్నాథ్ ఒకరు. సినిమా హిట్టైనా, ఫ్లాపైనా పూరీకి అవకాశాలు మాత్రం వస్తూనే ఉంటాయి. పూరీ సినిమాల్లో హీరోల పాత్ర చిత్రణ కూడా కొత్తగా ఉంటుంది. అందుకే ప్రతి హీరో కెరీర్లో ఒక్కసారైనా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో నటించాలని కోరుకుంటాడు. టెంపర్ సినిమా తరువాత సరైన హిట్ లేని పూరీ జగన్నాథ్ గత నెలలో విడుదలైన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. 
 
పూరీ తరువాత సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించబోతున్నాడు. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడిగా శ్రీదేవీ కూతురు జాన్వీ కపూర్ ను తీసుకుందామని పూరీ జగన్నాథ్ అనుకున్నాడట. బోణీ కపూర్ ను ఈ విషయమై పూరీ జగన్నాథ్ సంప్రదించగా బోణీ కపూర్ నో చెప్పినట్లు సమాచారం. బోణీ నో చెప్పటంతో పూరీ జగన్నాథ్ మరో హీరోయిన్ కోసం ప్రయత్నాలు జరుపుతున్నాడని తెలుస్తుంది. 
 
పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండతో తీయబోయే కథలో హీరో నత్తి పాత్రలో నటించబోతున్నాడని సమాచారం. హీరో నత్తి పాత్రలో నటించటంతో పాటు నత్తితోనే కామెడీ పండించబోతున్నాడని తెలుస్తుంది. తెలుగులో స్టార్ హీరోలు ఇప్పటికే ఇలాంటి ప్రయోగాలు చేసారు. జై లవ కుశ సినిమాలో ఎన్టీయార్ నత్తి పాత్రలో నటించగా, రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ చెవిటి పాత్రలో, రాజా ది గ్రేట్ సినిమాలో రవితేజ అంధుడిగా కనిపించారు. 
 
హీరోలు కొత్తగా ప్రయత్నించిన సినిమాలన్నీ హిట్ అవటంతో పూరీ విజయ్ పాత్రను ఇలా తీర్చిదిద్దాడని సమాచారం. ఈ సినిమాను పూరీ జగన్నాథ్ సొంత బ్యానర్ పై నిర్మిస్తాడని సమాచారం. మణిశర్మ ఈ సినిమాకు సంగీతం అందించబోతున్నాడు. 2020 జనవరి నెల నుండి ఈ సినిమా షూటింగ్ మొదలు కాబోతుందని తెలుస్తుంది. పూరీ జగన్నాథ్ ఈ సినిమాతో ఇస్మార్ట్ శంకర్ సినిమాను మించిన విజయాన్ని అందుకోవాలని కథ సిధ్ధం చేసినట్లు తెలుస్తుంది. 
 
 



మరింత సమాచారం తెలుసుకోండి: