ప్రభాస్ సాధారణంగా తన కుటుంబ విషయాలు బయటకు చెప్పడు. మీడియాకు చాలదూరంగా ఉండే ప్రభాస్ ఇప్పుడు ‘సాహో’ తన పద్ధతి మార్చుకుని దేశంలోని అనేక భాషలకు చెందిన మీడియా సంస్థలకు వరసపెట్టి ఇంటర్వ్యూలు ఇస్తూ క్షణం తీరిక లేకుండా బిజీగా ఉంటున్నాడు. 

లేటెస్ట్ గా బెంగుళూరుకు చెందిన ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభాస్ తన తల్లికి తన పై ఏర్పడ్డ కోపాన్ని వివరించాడు. వాస్తవానికి తన తల్లికి ఫిలిం ఇండస్ట్రీలో హీరో అవ్వడం ఇష్టం లేదని సినిమా హీరోగా అవ్వకుండా ఏదైనా ఒక మంచి వ్యాపారంలో సెటిల్ అయి పెళ్ళి చేసుకుని ఇద్దరు పిల్లలను కనమని తనకు తరుచూ చెప్పిన విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు.

ఆతరువాత 22 సంవత్సరాల వయసులో ‘ఈశ్వర్’ సినిమా హీరోగా ఎంటర్ అయినప్పుడు ఆమె తన హీరో ఎంట్రీని చూసి పెద్దగా ఆనందించక పోయినా కేవలం అలాంటి చిన్న సినిమాలు చేసుకుంటూ ముఖ్యంగా లవ్ స్టోరీ మూవీలను చేయమని ప్రోత్సహించిన విషయాలను బయటపెట్టాడు. అయితే ‘ఛత్రపతి’ నుండి ‘బాహుబలి’ వరకు తాను నటించే సినిమాల స్థాయి పెరగడంతో తన తల్లి తన ఇష్టాలకు తాను వ్యతిరేకంగా ఉంటున్న విషయాన్ని గ్రహించి ఆమె అసంతృప్తికి లోనైన విషయం తనకు తెలుసు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు.

‘బాహుబలి’ లో తన భారీ శరీరం కోసం తాను తన ఆహారపు అలవాట్లలో మార్పులు చేసుకుని విపరీతంగా గుడ్లు రకరకాల మాంసం తినడంతో పాటు గంటల తరబడి తాను తన బాడీ పెంపుదల కోసం వ్యాయామం చేయడం చూసి తన తల్లి తాను ఏమైపోతానో అంటూ భయపడిన విషయాలను నవ్వుతు గుర్తుకు చేసుకున్నాడు.  దీనికితోడు తాను ఇంటిలో ఉన్నప్పుడు సినిమాలకు సంబంధించి ఎప్పుడూ ఫోన్ కాల్స్ రావడం అదేవిధంగా సినిమాలకు సంబంధించిన చర్చలు జరిగే వాతావరణం ఎక్కువగా ఉండటంతో ఇంటిలో ప్రశాంతత కరువైంది అంటూ తన తల్లి తనతో అనేకసార్లు బాధపడిన విషయాలను కూడ బయటపెట్టాడు. దేశ వ్యాప్తంగా కోట్లాది మందికి నచ్చిన హీరోగా మారిన తాను తన తల్లికి మాత్రం నచ్చిన కొడుకుగా పూర్తిగా మారలేకపోయాను అంటూ ప్రభాస్ తన పై తానే వేసుకున్న సెటైర్లు మీడియాకు హాట్ న్యూస్ గా మారాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: