జూనియర్ ఎన్టీఆర్ నటించిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమాతో టాలీవుడ్ సినిమా పరిశ్రమకు దర్శకుడిగా పరిచయమైన రాజమౌళి, తోలి సినిమాతోనే మంచి సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తరువాత ఆయన తెరకెక్కించిన సింహాద్రి సినిమా అప్పట్లో పెద్ద విజయాన్ని అందుకుని, ఎన్టీఆర్ కు విపరీతమైన మాస్ ఇమేజిని తీసుకురావడం జరిగింది. ఇక అప్పటినుండి మొన్నటి బాహుబలి 2 వరకు, తన కెరీర్ పరంగా ఒక్క అపజయం కూడా ఎరుగని రాజమౌళి, ప్రస్తుతం రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లతో కలిసి ఆర్ఆర్ఆర్ అనే భారీ బడ్జెట్ మూవీని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. బ్రిటిష్ వారిపై పోరాటానికి తెగబడ్డ విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, 

కొమరం భీం ల కథగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై దేశవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ నెలకొని ఉంది. ఇకపోతే ఆయన తీసిన బాహుబలి రెండు భాగాలూ ఎంతటి అత్యద్భుత విజయాలు అందుకున్నాయో మనకు తెలిసిందే. అయితే ఆ సినిమాల తరువాత హీరో ప్రభాస్, దాదాపుగా రెండున్నరేళ్లు ఎంతో కష్టపడి నటించిన భారీ బడ్జెట్ మూవి సాహో, ఎన్నో అంచనాల మధ్య నేడు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. యువ దర్శకుడు సుజీత్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రభాస్ స్నేహితులు వంశి, ప్రమోద్, అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మించడం జరిగింది. ఇక సాహో ఫస్ట్ లుక్ టీజర్, ట్రైలర్ ల రిలీజ్ తరువాత, ఇది తప్పకుండా అద్భుతమైన విజయాన్ని అందుకుని, బాహుబలి రేంజ్ సక్సెస్ ని అందుకుంటుందని అందరూ భావించారు. అయితే నేడు తోలి అట నుండి చాలావరకు నెగటివ్ టాక్ సంపాదించిన ఈ సినిమా, ప్రేక్షకుల అంచనాలను తలక్రిందులు చేసింది. 

రూ.350 కోట్ల భారీ ఖర్చుతో తెరకెక్కబడిన ఈ సినిమాలో కేవలం విజువల్ గ్రాఫిక్స్ మాత్రమే ఉన్నాయని, అలానే సినిమాని ప్రేక్షకుడికి కనెక్ట్ చేయడంలో దర్శకుడు సుజీత్ చాలావరకు విఫలమయ్యారని అంటున్నారు ప్రేక్షకులు. ఇక దీనితో ఒక్క విషయం అయితే అందరికి తేటతెల్లం అయిందని,అదేమిటంటే గతంలో రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాల రికార్డులను బద్దలుకొట్టగల సత్తా మళ్ళి రాజమౌళి తీసే సినిమాలకే ఉందనేది, తమకు సాహో చూసిన తరువాతే చాలావరకు అర్ధం అయిందని అంటున్నారు. మరి అది ఎంతవరకు రాబోయే రోజుల్లో నిజమవుతుందో తెలియాలంటే మాత్రం మరికొన్నాళ్లు ఓపిక పట్టాల్సిందే...!! 


మరింత సమాచారం తెలుసుకోండి: