టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ జంటగా నటించిన ‘సాహో’ చిత్రం నిన్న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. మొదటి నుంచి ఈ మూవీపై భారీ అంచనాలు పెంచుకుంటూ వచ్చారు. తెలుగు, మళియాళ, కన్నడ, హిందీ భాషల్లో సాహో రిలీజ్ చేశారు. రూ.350 కోట్ల భారీ బడ్జెట్ తో రూపొందిన ఈ మూవీ అన్ని కేంద్రాల్లో ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. బాహుబలి చిత్రంతో ప్రభాస్ స్థాయి ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో సాహో చిత్రంపై అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే, ప్రేక్షకులను ఈ చిత్రం ఆశించిన స్థాయిలో అలరించలేకపోయింది.
ఓవర్సీస్ ప్రీమియర్లో 9,15,224 డాలర్లు వసూళ్లు రాబట్టడంతో బయ్యర్లు షాక్ అయ్యారు. ఇక వసూళ్ల పరంగా చూస్తే అమెరికాలో సాహో ఆరో స్థానంలో నిలిచింది. మహేశ్ బాబు నటించిన ‘స్పైడర్’ వంటి భారీ డిజాస్టర్ కూడా అమెరికా ప్రీమియర్లో 1.00 మిలియన్ డాలర్లు రాబట్టగా, పవన్ కల్యాణ్ ‘అజ్ఞాతవాసి’ 1.52 మిలియన్ డాలర్లు సాధించింది. తాజాగా ఈ మూవీ దర్శక, నిర్మాతలపై లీసా రే తీవ్ర విమర్శలు గుప్పించింది. ఇంత పెట్టుబడి పెట్టి..గ్రాండ్ గా రిలీజ్ చేసిన ‘సాహో’ కాపీ కొట్టే విషయంలో ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా అంటూ ఫైర్ అయ్యింది. సమకాలీన చిత్రకారిణి షిలో శివ్ సులేమాన్ ఆర్ట్ ను వారి పోస్టర్లలో కాపీ కొట్టారని ఆరోపించింది.
అంతే కాదు దానికి సంబంధించిన ఒరిజినల్ ఆర్ట్ వర్క్ తో పాటు ప్రభాస్, శ్రద్ధా కపూర్ లు ఉన్న పోస్టర్ ను షేర్ చేసింది. అయితే ఇంత రిచ్ గా తీసిన మూవీలో ఇలాంటి సీన్ కోసం ఆ ఆర్ట్ వాడటం తప్పుకాదు..కనీసం షిలోను సంప్రదించలేదు. కాపీ కొట్టడం సరికాదనే విషయం మూవీ మేకర్స్ కు తెలియాలి. ఇది ముమ్మాటికీ ఇతరుల క్రియేటివిటీని చోరీ చేయడమే. ఇలాంటివి ఏ మాత్రం అంగీకరించేవి కాదు. ఆమె అనుమతిని తీసుకోవడం కానీ, లేదా ఆమెకు క్రెడిట్ ఇవ్వడం కానీ చేయలేదు అంటూ లీసా రే మండిపడింది. మరి దీనిపై చిత్ర యూనిట్ ఎలా స్పందిస్తారో చూడాలి.